అక్షరటుడే వెబ్డెస్క్: Pawan Kalyan Delhi Speech | ఢిల్లీలో జరిగిన ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గురించి ఆయన ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Pawan Kalyan Delhi Speech | చలిచీమల పద్యంతో పోలిక..
సమావేశంలో పవన్ మాట్లాడుతూ, చిన్న శక్తులు కూడా బలమైన శక్తులను ఓడించగలవని పేర్కొన్నారు. “ఈ మధ్య కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో అందరం చూస్తున్నాం. దీన్ని చూస్తుంటే నాకు చలిచీమల పద్యం గుర్తుకొస్తోంది. బలమైన పాములను కూడా చలిచీమలు చంపగలవు. ఒక లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం ఖచ్చితంగా దక్కుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి వ్యక్తి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Pawan Kalyan Delhi Speech | జనసేన ప్రస్థానంపై..
పార్టీ ఆవిర్భావం గురించి గుర్తుచేసుకుంటూ, అధికారం ఆశించకుండా కేవలం దేశ శ్రేయస్సు కోసమే జనసేనను ప్రారంభించానని పవన్ చెప్పారు. లక్ష సభ్యత్వంతో మొదలైన తమ పార్టీ, నేడు 20 లక్షల సభ్యత్వాలకు చేరుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, గెలుపోటములను ఎదుర్కొన్నామని చెప్పారు.
Pawan Kalyan Delhi Speech | తెలంగాణ విభజనపై క్లారిటీ..
తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. “మేము తెలంగాణ ఏర్పాటుకు అడ్డు చెప్పలేదు. కేవలం 2014లో ఏపీని విభజించిన పద్ధతిని చూసి మాత్రమే బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీ విభజనను నిర్వహించిన తీరు అశాంతికి దారితీసింది. వారి పాత ధోరణి ఇంకా మారలేదు, దీనికి నిదర్శనమే మా సభకు అనుమతి నిరాకరించడం” అని పవన్ కల్యాణ్ కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.
ఇది కూడా చదవండి: Hyderabad Metro Phase 2 | కేటీఆర్ మాట వినే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి