అక్షరటుడే వెబ్డెస్క్: NEET Student Protests | నీట్ (NEET) విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేయడంపై రాజ్యసభాపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో తలెత్తిన కీలక సమస్యలపై స్పందించకుండా ప్రధాని వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. ఏకపక్షంగా ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమాలు నిర్వహించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల వాస్తవ సమస్యలపై స్పందించకుండా కేవలం ఉపన్యాసాలు ఇవ్వడానికే ప్రధాని పరిమితమయ్యారని ఆరోపించారు.
NEET Student Protests | పార్లమెంట్లో సమాధానం చెప్పాలి..
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్, యూజీసీ-నెట్ (UGC-NET) పేపర్ లీకేజీలు , నిరుద్యోగంపై ప్రధాని నేరుగా పార్లమెంట్ వేదికగా ప్రకటన విడుదల చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దేశంలోని ఈ పరిస్థితులతో యువత తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి కార్యక్రమాలను వాడుకుంటున్నారని విమర్శించారు. విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతోందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రధాని ఏమాత్రం గౌరవించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు.
ఇది కూడా చదవండి: Opposition Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాల ఆందోళన