అక్షరటుడే, వెబ్డెస్క్: RBI New Rules | బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, భవిష్యత్తులో వచ్చే నష్టాలను ముందే అంచనా వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్తి వర్గీకరణ, అంచనా వేసిన రుణ నష్టం (ఈసీఎల్)నకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది.
ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీనుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పు వల్ల బ్యాంకుల లాభాలపై స్వల్ప ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
RBI New Rules | ఈసీఎల్ అంటే?
ఇప్పటివరకు బ్యాంకులు ఏదైనా రుణం మొండి బాకీగా మారిన తర్వాతే అంటే నష్టం జరిగిన తర్వాత దానికి సంబంధించిన నిధులను కేటాయిస్తున్నాయి. ఇకపై ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్(ఈసీఎల్) విధానం అమలులోకి రానుంది. అంటే ఒక రుణం భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని బ్యాంక్ భావిస్తే.. ఆ నష్టం జరగకముందే దానికి సరిపడా నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుందన్న మాట. దీనికోసం బ్యాంకులు రుణాలను మూడు దశలుగా వర్గీకరించాయి.
RBI New Rules | రుణ ఖాతాల వర్గీకరణ ఇలా..
స్టేజ్ 1 : క్రెడిట్ రిస్కు ఏమాత్రం పెరగని, సక్రమంగా చెల్లింపులు జరుగుతున్న ఉన్న ఖాతాలు ఈ కేటగిరిలో ఉంటాయి. వీటికి రాబోయే 12 నెలల్లో ఎదురయ్యే నష్టాలను ముందస్తుగా అంచనా వేసి నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
స్టేజ్ 2 : రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ, క్రెడిట్ రిస్కు గణనీయంగా పెరిగిన ఖాతాలను ఇందులో చేరుస్తారు. వీటికి మొత్తం రుణ కాలానికి అయ్యే నష్టాన్ని లెక్కించి ఆ మేరకు నిధులను పక్కన పెట్టాలి. ఈ దశలో బ్యాంకులపై ఎక్కువ భారం పడే అవకాశాలున్నాయి.
స్టేజ్ 3 : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న లేదా 90 రోజులు దాటినా రుణ చెల్లింపులు జరగని ఖాతాలను ఈ వర్గంలో చేరుస్తారు. ఈ ఖాతాలకు కూడా లైఫ్టైమ్ నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
RBI New Rules | ముఖ్యమైన మార్పులు..
90 రోజుల నిబంధన : ఎవరి లోన్ అయినా బకాయి పడి 30 రోజులు దాటితే దానిని ప్రమాద సూచికగా భావించి బ్యాంక్ అప్రమత్తం కావాలి. 90 రోజులు దాటితేనే దానిని ఎన్పీఏగా పరిగణిస్తారు.
బారోవర్ లెవల్ క్లాసిఫికేషన్ : గతంలో ఒక కస్టమర్ ఒక లోన్ కట్టకపోయినా మిగిలిన అప్పులను బాగున్నట్లు చూపించే వీలుండేది. ఇకపై ఇది వీలుకాదు. కస్టమర్ ఒక ప్రధాన లోన్ ఎన్పీఏ అయితే ఆ రుణగ్రహీతకు సంబంధించిన ఇతర రుణాలను కూడా బ్యాంకులు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
వ్యక్తిగత రుణ పరిమితి పెంపు : వ్యక్తిగత రుణాల రిస్క్ వెయిట్ ప్రయోజనం పొందే పరిమితిని రూ. 7.5 కోట్ల నుంచిి రూ. 10 కోట్లకు పెంచారు. దీనివల్ల రూ. 10 కోట్ల వరకు వ్యక్తిగత రుణాలు తక్కువ రిస్క్ భారం కిందకు వస్తాయి.
RBI New Rules | ప్రభుత్వ బ్యాంకులపై భారం?
ఆర్ బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై భారం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఎస్బీల నికర విలువపై ఒకేసారి 5 -10 శాతం భారీ కోత పడే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల వ్యయాలు 20 – 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు. 30 నుంచి 90 రోజుల ఓవర్డ్యూ ఉన్న హామీలేని రుణాలు, సూక్ష్మ రుణాలు, వాహన రుణాల విభాగాల్లో అధిక వాటా ఉన్న బ్యాంకులకు నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గృహరుణాలు ఎక్కువగా ఇచ్చే బ్యాంకులకు ఈ విధానం సానుకూలమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ప్రభుత్వ బ్యాంకులపై ఒత్తిడి ఉంటుందన్న వాదనను రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తోసిపుచ్చుతోంది. నిబంధనలను నాలుగేళ్ల పాటు దశలవారీగా అమలు చేయనున్నందున బ్యాంకుల మూలధనంపై 50 -80 బేసిస్ పాయింట్ల పరిమిత ప్రభావమే ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. మొదటి రోజే మూలధనం భారీగా పడిపోకుండా దశలవారీ విధానం కాపాడుతుందని, డివిడెండ్ల చెల్లింపులను కొంచెం తగ్గించుకోవడం వంటి చర్యలతో బ్యాంకులు ఈ మార్పును చాలా సులభంగా సర్దుబాటు చేసుకుంటాయని విశ్లేషించింది.
ఇది కూడా చదవండి..: Mumbai Kalma Attack Case | ప్రాణాల కోసం ఆరాటం… తెల్లవారుజామున భయానక క్షణాలు.. ముంబయిలో పహల్గావ్ తరహాలో దాడికి ప్రణాళిక!


[…] ఇది కూడా చదవండి..: RBI New Rules | బ్యాంకింగ్ రంగంలో పెను మార్పుల… […]