అక్షరటుడే, వెబ్డెస్క్: Air India Services Cut | పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విమానాల్లో వాడే ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్లైన్ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్ ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. పలు మార్గాల్ల విమాన సర్వీసులను తగ్గించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రతి రోజూ 100 విమానాలను తక్కువగా నడపనున్నట్లు పేర్కొంది.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (Aviation Turbine Fuel) ధరలు విపరీతంగా పెరగడంతో, ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ నెట్వర్క్లలో తన కార్యకలాపాలను తగ్గించింది. ఈ సంస్థ ప్రస్తుతం రోజుకు సుమారు 1,100 విమానాలను నడుపుతోంది. అయితే ఇందులో 100 విమానాలను తగ్గించనుంది. జూన్ నెలలో యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్లతో కలిపే మార్గాలలో విమాన సర్వీసులు తగ్గించనున్నట్లు సమాచారం.
Air India Services Cut | 5 శాతం పెరుగుదల
అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరలు శుక్రవారం 5 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎఫ్ ధరలను వరుసగా రెండో నెలలో పెంచాయి. అయితే దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ (ATF) రేట్లలో ఎలాంటి సవరణ జరగలేదు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ప్రకారం, ఢిల్లీలో అంతర్జాతీయ ఆపరేటర్ల కోసం జెట్ ఇంధనం ధరను కిలోలీటరుకు 76.55 డాలర్లు పెంచారు. దీంతో ఆ ధర కిలోలీటరుకు 1,511.86 డాలర్లకు చేరింది.
ఇది కూడా చదవండి..: GST Collections | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

