అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay Statement | కొడుకు భగీరథ్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తన అంతరంగాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. దాని సారంశం ఆయన మాటల్లోనే..
Bandi Sanjay Statement | రాజకీయ కుట్ర..
నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉంటాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు.
ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనుకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది. ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది… అంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చారు.
Bandi Sanjay Statement | హనీట్రాప్ ఫిర్యాదు..
ఇటీవల తనను ఓ అమ్మాయి కుటుంబం హనీట్రాప్ చేసి.. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ బండి సంజయ్ తనయుడు భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్నేహితుల ద్వారా పరిచయమైన ఓ యువతి తనతో స్నేహపూర్వకంగా ఉండేదని ఆ చొరవతోనే ఆమె కుటుంబ సభ్యులు తనను పార్టీలు, ఫంక్షన్లకు ఆహ్వానించేవారన్నారు. తామిద్దరం పలు ఆలయాలను కూడా సందర్శించామని ఎఫ్ఐఆర్లో రాశారు.
అయితే సదరు యువతి తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని.. ఆమె కుటుంబం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. వారి వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన స్నేహితులకు కూడా గతంలో ఈ కుటుంబంతో ఇబ్బందులు ఎదురయ్యాయని.. వారిపై నిర్మల్ ఠాణాలో ఫిర్యాదు కూడా ఉందని గుర్తు చేశారు.
Bandi Sanjay Statement | బాలిక ఫిర్యాదు..
మరోవైపు, మే 8న బాలిక కుటుంబ సభ్యులు భగీరథ్పై పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మైనర్ అని.. ఆమెపై భగీరథ్ అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో పొక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు రెండు వైపులా ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టారు.
Bandi Sanjay Statement | పేరు తొలగింపు..
ఇదిలా ఉండగా.. నేడు హైదరాబాద్లో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డుల నుంచి బండి సంజయ్ పేరు తొలగించారు. కుమారుడు భగీరథ్పై పొక్సో కేసు నమోదు కావడంతోనే పార్టీపై ప్రభావం పడొద్దన్న ఉద్దేశంతో బండి సంజయ్ పేరు తొలగించినట్లు తెలుస్తోంది.

