అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Paper Leak | నీట్ (NEET 2026) ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారిని సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది.
వైద్య కళాశాల్లలో ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్షను మే 3న ఎన్టీఏ (NTA) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసింది. జూన్ 21న మళ్లీ ఎగ్జామ్ పెడతామని ప్రకటించింది. మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో పరీక్షా పత్రాల లీకేజీకి మూలమైన ఒక కీలక సూత్రధారిని CBI గుర్తించింది.
NEET Paper Leak | కెమిస్ట్రీ లెక్చరర్
ఎన్టీఏ తరఫున పరీక్ష నిర్వహణ ప్రక్రియలో పాలుపంచుకున్న రసాయనశాస్త్ర అధ్యాపకుడు (Chemistry Lecturer) P.V. కులకర్ణే ఈ లీకేజీకి కారణమని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అతనికి ప్రశ్నపత్రాలను చూసే అవకాశం ఉండేది. దీంతో ఏప్రిల్ 2026 చివరి వారంలో మరొక నిందితురాలైన మనీషా వాఘ్మారేతో కలిసి కులకర్ణే కొంతమంది విద్యార్థులను సమీకరించి పూణేలోని తన నివాసంలో వారికి ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించాడు. ఈ ప్రత్యేక తరగతుల్లో అతను ప్రశ్నలను, వాటికి సంబంధించిన ఆప్షన్స్, సరైన సమాధానాలను విద్యార్థులకు చెప్పాడు. విద్యార్థులు తమ నోట్బుక్లలో రాసుకున్న ప్రశ్నలు మే 3న జరిగిన అసలైన పరీక్షా పత్రంలోని ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో మనీషాను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. తాజాగా కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు.
NEET Paper Leak | ఇలా దొరికాడు
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం వరకు మొత్తం ఏడుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురిని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి, లోతుగా విచారించే నిమిత్తం 7 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. కాగా పీవీ కులకర్ణి విషయం విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో బయట పడింది. ఆయన నిర్వహించిన మాక్టెస్ట్లోని 42 ప్రశ్నలు మే 3న జరిగిన NEET UG పరీక్షలోని ప్రశ్నలతో అచ్చం సరిపోలాయని ఆరోపిస్తూ కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. ఈ దర్యాప్తు వివరాలను CBIకి తెలియజేయడం ద్వారానే, ఈ వ్యవహారానికి “సూత్రధారి” అయిన పి.వి. కులకర్ణి బండారం బయటపడిందని లాతూర్కు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
దీనిని కూడా చదవండి : UAE LPG Deal | ఎల్పీజీ సరఫరాపై యూఏఈతో భారత్ కీలక ఒప్పందం


