అక్షరటుడే వెబ్డెస్క్:ICSE Topper Mother| ఐసీఎస్ఈ (ICSE) పదవ తరగతి ఫలితాల్లో దేశవ్యాప్తంగా రెండో ర్యాంకు సాధించిన పశ్చిమ బెంగాల్ విద్యార్థి దిబ్యేందు ప్రమాణిక్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించినప్పటికీ, ఆ ఒక్క మార్కు ఎందుకు రాలేదని అతని తల్లి వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ICSE Topper Mother|ఒక్క మార్కుపై తల్లి ఆవేదన..
సిలిగురిలోని ఆక్సిలియమ్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థి అయిన దిబ్యేందు ప్రమాణిక్, అత్యుత్తమ ప్రతిభతో 99.8 శాతం మార్కులు సాధించాడు. అయితే, అతని తల్లి బని ప్రమాణిక్ శర్మ (వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు) దీనిపై మాట్లాడుతూ.. “నా కుమారుడు మరో మార్కు సాధించి ఉంటే బాగుండేది. అతను ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆ ఒక్క మార్కు కూడా వచ్చేది, అది రానందుకు మాకు కొంచెం బాధగా ఉంది” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ICSE Topper Mother|తల్లి మాటలే నా అభిప్రాయం..
తన తల్లి వ్యాఖ్యలపై దిబ్యేందు స్పందిస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపాడు. “ఆ ఒక్క మార్కు కోల్పోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ పర్వాలేదు, నేను మంచి ఫలితమే సాధించానని భావిస్తున్నాను” అని అతను విలేకరులతో పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని ఈ సందర్భంగా దిబ్యేందు వెల్లడించాడు.
ICSE Topper Mother|విభిన్న స్పందనలు..
దేశస్థాయిలో రెండో ర్యాంకు వచ్చినా, కేవలం ఒక్క మార్కు తక్కువ వచ్చిందని తల్లి అసంతృప్తి వ్యక్తం చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విద్యార్థులపై తల్లిదండ్రుల ఒత్తిడికి ఇది నిదర్శనమని కొందరు అంటుంటే, కుమారుడిపై ఉన్న నమ్మకంతో ఆమె అలా అని ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Cloudflare Layoffs | ఏఐ ప్రభావం.. 1,100 మంది ఉద్యోగులని తొలగిస్తున్న క్లౌడ్ఫ్లేర్!

