అక్షరటుడే వెబ్డెస్క్: SRIVANI Trust Tickets | తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ (SRIVANI Trust) దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు కీలక మార్పులు చేసింది. భక్తులకు మరింత సులభంగా దర్శన భాగ్యం కల్పించేందుకు కోటాల వారీగా టికెట్ల కేటాయింపును పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం టీటీడీ రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటి విరాళాలు, బుకింగ్స్ ఆధారంగా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
SRIVANI Trust Tickets | కోటాల వారీగా టికెట్లు..
రోజువారీ కోటాలోని 1,500 టికెట్లలో.. 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా సౌకర్యం కల్పించారు. తిరుపతి విమానాశ్రయానికి వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా ప్రతిరోజూ 200 శ్రీవాణి టికెట్లను కేటాయిస్తున్నారు. రోజువారీ కరెంట్ బుకింగ్ కింద ఇచ్చే 800 టికెట్లలో ఒక కీలక మార్పు చేశారు. ఇప్పటికే రూ.10 వేల విరాళం అందించి, దర్శన టికెట్ల కోసం వేచి చూస్తున్న దాతల కోసం ఇందులోంచి ప్రతిరోజూ ప్రత్యేకంగా 300 టికెట్లను కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.
SRIVANI Trust Tickets | ఎప్పటి నుంచి వర్తిస్తుంది?
2025 మే 1వ తేదీ నుంచి విరాళాలు చెల్లించిన అర్హులైన దాతలందరికీ ఈ ప్రత్యేక కోటా సదుపాయం వర్తించనుంది. ఈ కోటాకు సంబంధించిన టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1 గంటలోపు టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు, అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్లో స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ కొత్త విధానం జూన్ 10 నుంచి అధికారికంగా అమలులోకి రానుంది.

ఒకవేళ నిర్దేశిత సమయంలోగా దాతల కోటాలో టికెట్లు మిగిలిపోతే.. వాటిని తిరిగి సాధారణ కరెంట్ బుకింగ్ కోటాకే బదిలీ చేసి భక్తులకు జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 మార్చి 31 వరకు అమలులో ఉంటాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Goud Student Felicitation | గౌడ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి



