Abhijeet Dipke BJP | బీజేపీలోకి రావాలని బెదిరింపులు.. సీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు

భారతీయ జనతా పార్టీలో చేరాలని తనను కొందరు బెదిరిస్తున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) చీఫ్ అభిజీత్ డిప్కే సంచలన ఆరోపణలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెడ్‌డెస్క్: Abhijeet Dipke BJP | భారతీయ జనతా పార్టీలో చేరాలని తనను కొందరు బెదిరిస్తున్నారని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) చీఫ్ అభిజీత్ డిప్కే సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో చేరితే తనతో పాటు కుటుంబం బాగుంటుందని ప్రలోభపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో చేరకపోతే కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్‌ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే ఈ విధంగా బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పోలిస్తే తన వయసు ఎంత ఉంటుందని, యువతను భయపెట్టే స్థాయికి దిగజారడం బాధాకరమని అన్నారు.

Abhijeet Dipke BJP | అమిత్ షానే బాధ్యత వహించాలి..

విద్యార్థుల నిరసనల సమయంలో ఆందోళనకారులపై జరిగిన పోలీసుల దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని అభిజీత్ డిమాండ్ చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై పెల్లెట్ గన్స్, ఏకే-47 వంటి ఆయుధాలు వాడి ఉంటారని ఆరోపించారు. కసబ్ లాంటి ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన ఏకే-47 తుపాకులను యువతపై ఎక్కుపెట్టడం దారుణమని, పోలీసుల దాడుల్లో కొందరు విద్యార్థులు కంటిచూపు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోకి విదేశీ నిధులు వస్తున్నాయనే ఆరోపణలు నిజమైతే, అది దేశ భద్రతా యంత్రాంగం వైఫల్యమేనని, దానికి హోంమంత్రే జవాబుదారీ అని స్పష్టం చేశారు. నూతన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీపై విమర్శలు గుప్పిస్తూ.. లైంగిక దాడి కేసుల్లో నిందితులను సమర్థించేవారికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రధాని దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Abhijeet Dipke BJP | బాబా రామ్‌దేవ్‌కు కౌంటర్..

సీజేపీ పార్టీ యువతను తప్పుదారి పట్టిస్తోందంటూ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలకు అభిజీత్ ఘాటుగా బదులిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, విద్యను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సమాజానికి ఎలా హాని అవుతుందని నిలదీశారు. బాబా రామ్‌దేవ్ రాజకీయాల గురించి మాట్లాడటం మానుకుని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పతంజలి ఉత్పత్తుల నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లోపభూయిష్టమైన మీ ఉత్పత్తుల గురించే ముందు ఆందోళన చెందాలని, లేకపోతే కంపెనీని మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, సంస్కృతిని నేటి యువత (Gen Z) చాలా సమర్థవంతంగా కాపాడుకోగలదని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Nizamabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *