Asim Munir Iran Visit | హార్ముజ్‌ జలసంధిపై ట్రంప్‌ ఆఫర్‌.. అమెరికా-ఇరాన్ మధ్య తెరవెనుక చర్చలు ఫలించేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Asim Munir Iran Visit | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయితో సమావేశమైన ఆయన, ఇరాన్‌కు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. హార్ముజ్ జలసంధిపై ఉన్న ఆంక్షలను, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, అందుకు ప్రతిగా ఆ కీలక జలమార్గాన్ని తెరిచి ఉంచాలని ఇరాన్‌ను కోరినట్లు సమాచారం.

అయితే ఈ ప్రతిపాదనలకు సంబంధించి అమెరికా లేదా ఇరాన్ అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ చేయలేదు. ఈ భేటీ చాలా స్పష్టంగా, నిర్ణయాత్మకంగా సాగిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాకుండా టెహ్రాన్‌కు అనుబంధంగా ఉన్న గ్రూపులు తమ దాడులను నిలిపివేయాలని, అలాగే గత జూన్‌లో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంపై మళ్లీ చర్చలు జరపాలని మునీర్ కోరినట్లు తెలుస్తోంది.

Asim Munir Iran Visit | మధ్యవర్తిగా పాకిస్థాన్ పాత్ర..

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగానే అసిమ్ మునీర్ తన వెంట పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీతో కలిసి సోమవారం ఇరాన్‌లో పర్యటించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికే ఈ పర్యటన చేపట్టినట్లు పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. అయితే గతంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేసిన కాల్పుల విరమణ కేవలం నెల రోజుల్లోనే విఫలమైన సంగతి తెలిసిందే.

Asim Munir Iran Visit | ఇరాన్ నేతల స్పందన..

ఇరాన్ పర్యటనకు వెళ్లే ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అసిమ్ మునీర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి ఇరాన్ అంశాలపై చర్చించినట్లు సీఎన్‌ఎన్ కథనం వెల్లడించింది. టెహ్రాన్ పర్యటనలో భాగంగా మునీర్.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్‌లతో కూడా సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

ఈ సమావేశాల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ.. జూన్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అమెరికా తన హామీలను ఉల్లంఘించడం వల్లే ఒప్పంద అమలులో జాప్యం జరిగిందని ఆరోపించారు. అమెరికా తన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి కేంద్రంగా నెలకొన్న ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో, మునీర్ తాజా పర్యటన అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి:  Musi River Project | మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *