అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Barrier Lake | ఒకవైపు ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి నేపాల్ Nepal ఇంకా తేరుకోకముందే.. మరో ప్రమాద హెచ్చరిక ఆ దేశాన్ని వణికిస్తోంది. నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన భారీ బారియర్ సరస్సు ఎప్పుడైనా బద్దలయ్యే ప్రమాదం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు. ఈ సరస్సు తెగిపోతే దిగువ ప్రాంతాల్లో మరోసారి భారీ వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Nepal Barrier Lake | 72 గంటలు కీలకం..
చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల సంగమానికి సమీపంలో ఈ బారియర్ సరస్సు ఏర్పడింది. గురువారం ఉదయం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే నీరు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో.. రానున్న మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో సరస్సు కట్ట తెగే ప్రమాదం మరింత పెరిగిందని చైనా హెచ్చరించింది.
Nepal Barrier Lake | ఆందోళనలో నేపాల్
ఈ హెచ్చరిక నేపాల్లో ఇప్పటికే తీవ్ర విషాదం నెలకొన్న సమయంలో రావడం ఆందోళన కలిగిస్తోంది. బోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి.
సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి నీరు ఒక్కసారిగా దిగువకు విడుదలైతే.. అదే నదీ వ్యవస్థలో మరో భారీ వరద ఉద్ధృతి ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Nepal Floods | 359కు చేరిన నేపాల్ వరద మరణాల సంఖ్య..579 మంది గల్లంతు
బోటేకోషి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నేపాల్ జల, విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. నదీ తీరాలకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు.
Nepal Barrier Lake | సరిహద్దుల్లో హై అలర్ట్
పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైన వరద పరిస్థితులపై రియల్టైమ్ సిమ్యులేషన్లు, ప్రమాద అంచనాలు నిర్వహిస్తూ.. సరస్సు బద్దలైతే ప్రభావం ఎలా ఉండొచ్చన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. మరోవైపు నేపాల్ అధికారులు కూడా దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఇప్పటికే భారీ వరదలతో అతలాకుతలమైన హిమాలయ ప్రాంతానికి తాజా బారియర్ సరస్సు హెచ్చరిక మరో సవాలుగా మారింది. రానున్న మూడు రోజులు అత్యంత కీలకంగా మారడంతో.. సరస్సు కట్ట నిలుస్తుందా? లేక మరోసారి నీటి ఉద్ధృతి నేపాల్ను ముంచెత్తుతుందా? అనే భయం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంది.