Iran Oil | మునిగిపోతున్న నౌకకు ‘డెడ్ ట్యాంకర్’ ఆసరా.. అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ రివర్స్ ప్లాన్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Oil | ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు యుద్ధ మేఘాలను తలపిస్తున్నా, తెరవెనుక మాత్రం ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. శాంతి చర్చల ప్రస్తావన వస్తున్నా.. “ఓడరేవుల దిగ్బంధనాన్ని తొలగించే వరకు చర్చలు లేవని” ఇరాన్, “ఒప్పందం కుదిరేదాకా ఆంక్షలు ఎత్తేయమని” అమెరికా పట్టుబట్టడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు రంగం సంక్షోభంలో పడింది.

Iran Oil | ఖర్గ్ ద్వీపంలో నిండిపోయిన నిల్వలు

ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ద్వీపం (Kharg Island) అత్యంత కీలకం. దేశం నుంచి వెళ్లే 90 శాతం చమురు (Crude Oil) ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతాయి. ఈ ద్వీపంలో గరిష్టంగా 30 మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అమెరికా (America) దిగ్బంధనం వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో, ప్రస్తుతం అక్కడ కేవలం 13 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే ఖాళీ ఉంది. ఇరాన్ రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అంటే మరో రెండు వారాల్లో నిల్వ ట్యాంకులన్నీ హౌస్‌ఫుల్ కానున్నాయి.

Iran Oil | చమురు ఉత్పత్తిని ఎందుకు ఆపలేరు?

ఎగుమతులు లేనప్పుడు ఉత్పత్తిని ఆపేయవచ్చు కదా? అనే ప్రశ్న వస్తుంది. కానీ చమురు బావుల విషయంలో అది చాలా ప్రమాదకరం. చమురు వెలికితీతను నిలిపివేస్తే బావుల్లో పీడనం (Pressure) తగ్గిపోతుంది. పీడనం తగ్గగానే భూగర్భంలోని నీరు చమురు ఉన్న శిలల్లోకి చొచ్చుకుపోతుంది.

శాశ్వత నష్టం: ఒకసారి నీరు చేరితే, భవిష్యత్తులో మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించినా చమురుకు బదులు నీరే వస్తుంది. దీనివల్ల కొన్ని బావులు శాశ్వతంగా నిరుపయోగంగా మారిపోతాయి. అందుకే నష్టపోయినా సరే ఇరాన్ ఉత్పత్తిని కొనసాగించక తప్పడం లేదు.

Iran Oil | నిల్వ కోసం పాత మార్గాలు

వచ్చే రెండు వారాల్లో స్టోరేజీ ట్యాంకులు నిండిపోతుండటంతో, ఇరాన్ ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల క్రితం పక్కన పెట్టేసిన ‘నషా’ (Nasha) అనే డెడ్ ట్యాంకర్‌ను మళ్ళీ వెలికితీసింది. ఏప్రిల్ 16 నుంచి ఖర్గ్ నుంచి మూడు భారీ ట్యాంకర్లలోకి దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంటే అమెరికాతో ఈ ప్రతిష్టంభన మరికొంత కాలం కొనసాగినా తట్టుకోవాలని ఇరాన్ భావిస్తోంది.

అమెరికా ఆర్థిక వ్యూహం

ఇది కేవలం సైనిక దిగ్బంధనం మాత్రమే కాదని, ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే చర్య అని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. “కొద్ది రోజుల్లోనే ఇరాన్ చమురు బావులు మూతపడక తప్పదు, తద్వారా వారి ప్రధాన ఆదాయానికి గండి పడనుంది” అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : India New Zealand FTA | భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందం.. 8,284 ఉత్పత్తులపై ఇక జీరో ట్యాక్స్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *