అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fishermen Welfare Programs | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో (Nizamabad Rural Constituency) అన్ని వర్గాల అభ్యున్నతిని ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశం నిర్వహించారు.
Fishermen Welfare Programs | మత్స్యకారుల సంక్షేమం కోసం..
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుంచే చేపపిల్లల పెంపకం చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషిచేస్తున్నామన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతిఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే అందజేయడం జరుగుతుందన్నారు.
అందుకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామన్నారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అదేవిధంగా అర్సపల్లిలో (Arsapally) మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ భూమిని పూర్తి స్థాయిలో కాపాడే విధంగా జిల్లా అధికారుల చొరవతో ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో పాటు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు.
Fishermen Welfare Programs | మత్స్యకార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం..
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఇదివరకు మత్స్యశాఖకు (Department of Fisheries) సంబంధించి కార్యక్రమాలు మొక్కుబడిగా జరిగేవని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ మత్స్య కార్మికుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. అర్సపల్లిలో ఎంతో విలువైన మత్స్య కార్మిక సంఘం స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి, సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు.
కాగా.. ఆయా సంఘాలకు ప్రభుత్వ పరంగా కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంఘ బాధ్యులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడీ ఆంజనేయ ప్రసాద్, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Free Health Checkup | కార్మికులకు గుడ్ న్యూస్.. 40 ఏళ్లు దాటితే ఉచిత హెల్త్ చెకప్ !

