అక్షరటుడే వెబ్డెస్క్:Kalaignar Women Scheme|తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా లబ్ధిదారులకు తీపి కబురు అందించింది. మే 2026 నెలకు సంబంధించిన ‘కలైంజ్ఞర్ మహిళా హక్కుల గుర్తింపు పథకం’ నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజయ్ అధికారులను ఆదేశించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది.
Kalaignar Women Scheme|లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు..
ఈ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మే నెలకు సంబంధించిన ఈ మొత్తాన్ని ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక కారణాలు లేదా ఇతర ప్రక్రియల వల్ల నిధుల పంపిణీలో ఆలస్యం కాకుండా చూడాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Kalaignar Women Scheme|పథకం పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి..
ప్రస్తుతం అమలవుతున్న కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకాన్ని మరింత మెరుగుపరిచేందుకు , పునర్వ్యవస్థీకరించేందుకు (Restructuring) ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొంత సమయం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ మార్పుల వల్ల మహిళలకు అందాల్సిన నెలవారీ సాయం నిలిచిపోకూడదనే ఉద్దేశంతో తక్షణమే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
Kalaignar Women Scheme|ముఖ్యమంత్రి కీలక చర్యలు..
పథకం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యేలోగా మహిళలకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదని సీఎం విజయ్ ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ నగదు లబ్ధిదారులందరికీ అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి: Firecracker Factory Blast | బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. నలుగురు మృతి


