అక్షరటుడే, వెబ్డెస్క్: Kashi 9 Nights | ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా కాశీ (వారణాసి) వెళ్లి విశ్వనాథుడిని దర్శించుకోవాలని కోరుకుంటాడు. కాశీలో మరణిస్తే నేరుగా మోక్షం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. అయితే, జీవితాంతం కాశీలోనే గడపడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, కేవలం “తొమ్మిది రాత్రులు” కాశీ (Kashi)లో నియమంగా గడిపితే చాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
Kashi 9 Nights | 9 రాత్రుల వెనుక ఉన్న కారణం..
ఒక బిడ్డ భూమిపై జన్మించడానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాడు. అలాగే, మళ్లీ జన్మ లేకుండా మోక్షం పొందడానికి పూర్వం వ్యాసమహర్షి కాశీలో తొమ్మిది నెలలు సాధన చేయమని చెప్పారు. కానీ, కలియుగంలో అంత సమయం కేటాయించడం కష్టం కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా ఈ “9 రాత్రుల” నియమం వచ్చింది.
Kashi 9 Nights | ఈ 9 రోజులు పాటించాల్సిన నియమాలు..
కాశీలో ఉన్నప్పుడు కేవలం తిరగడం మాత్రమే కాకుండా కొన్ని నియమాలు పాటించాలి. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం, ఉదయం-సాయంత్రం గంగా నదిలో స్నానం చేయడం, కోపం, అబద్ధాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా శివనామ స్మరణ చేస్తూ, తోచినంతలో దానధర్మాలు చేయాలి.
Kashi 9 Nights | మొదటి మూడు రోజుల పూజలు..
మొదటి రోజు యాత్రను మణికర్ణికా ఘాట్లో పవిత్ర స్నానంతో ప్రారంభిస్తారు. పితృ దేవతలకు తర్పణాలు ఇచ్చి, డుండి వినాయకుడు, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. రెండో రోజు గంగాస్నానం చేసి విశ్వనాథుడు, అన్నపూర్ణ దేవిని దర్శిస్తారు. రోజంతా శివ మంత్రాలు జపిస్తారు. మూడో రోజు అసి ఘాట్, దశాశ్వమేధ ఘాట్ వంటి ప్రముఖ ఘాట్లను సందర్శిస్తూ, అక్కడ ఉన్న శివలింగాలను పూజిస్తారు.
నాల్గవ రోజు క్షేత్ర పాలకుడి దర్శనం..
నాలుగో రోజున కాశీ విశ్వనాథుడితో పాటు కాలభైరవుడిని దర్శించుకుంటారు. కాలభైరవుడు కాశీ నగరానికి రక్షకుడు. ఆయనను దర్శించుకుంటేనే కాశీ యాత్ర విజయవంతంగా పూర్తవుతుందని భక్తుల నమ్మకం.
5 నుండి 8వ రోజు వరకు పంచక్రోశ యాత్ర..
ఐదో రోజు నుంచి భక్తులు ఎంతో పవిత్రమైన పంచక్రోశ యాత్ర మొదలుపెడతారు. ఇది దాదాపు 80 కిలోమీటర్ల పాదయాత్ర. ఆరో రోజున మౌన వ్రతం (మాట్లాడకుండా ఉండటం) పాటిస్తూ నడుస్తారు. ఏడో రోజున చెట్ల నీడన విశ్రమిస్తూ శివధ్యానం చేస్తారు, సాధువులకు అన్నదానం చేస్తారు. ఎనిమిదో రోజుకు ఈ పాదయాత్ర ముగిసి, భక్తులు మళ్లీ మణికర్ణికా ఘాట్కు చేరుకుంటారు.
తొమ్మిదో రోజు యాత్ర ముగింపు..
తొమ్మిదో రోజున విశ్వనాథుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. అన్నపూర్ణ దేవి దగ్గర భిక్ష స్వీకరిస్తారు. చివరగా కాలభైరవుడి దగ్గరకు వెళ్లి, కాశీ వదిలి వెళ్ళడానికి అనుమతి తీసుకుని తిరుగు ప్రయాణం అవుతారు.
ఇంటికి వచ్చాక చేయాల్సిన పూజ..
కాశీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని పూజ చేయాలి. కాశీ నుండి తెచ్చిన గంగాజలం, విభూతి, ప్రసాదం బియ్యాన్ని పూజ గదిలో ఉంచి దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచాలి. ఇలా చేస్తేనే కాశీ యాత్ర పూర్తి ఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం.
ఇది కూడా చదవండి..: Sapta Jyotirlinga Tour | ఆధ్యాత్మిక యాత్రకు ఐఆర్సీటీసీ తోడు.. సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ పేరిట టూర్ ప్యాకేజీ


