అక్షరటుడే, వెబ్డెస్క్ : Pahalgam Terror Attack | ప్రకృతి అందాలతో కళకళలాడే పహల్గాం… మంచు దుప్పట్లు, లిడ్డర్ నది గలగలలు, పర్యాటకుల సందడితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ఈ స్వర్గధామం… ఏడాది క్రితం రక్తసిక్తమైంది.
2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ఈ అందమైన నేలను క్షణాల్లోనే విషాద క్షేత్రంగా మార్చింది. నేటితో ఆ విషాద ఘటనకు ఏడాది పూర్తవుతోంది. కానీ ఆ రోజు మిగిల్చిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున, సైనిక దుస్తుల్లో మారువేషంలో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ప్రకృతిని ఆస్వాదిస్తున్న అమాయకులపై జరిగిన ఈ కాల్పులు క్షణాల్లోనే ఆ ప్రదేశాన్ని శ్మశానంగా మార్చాయి.
Pahalgam Terror Attack | ఆపరేషన్ సిందూర్.. భారత్ ప్రతిస్పందన
ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు కలిపి మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడి జీవితాంతం మానని బాధను మోస్తున్నారు. 2008 ముంబయి దాడుల తర్వాత దేశాన్ని ఇంతలా కుదిపేసిన ఘటన ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ దారుణంపై భారత్ మౌనంగా ఉండలేదు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టిన భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) ద్వారా ఉగ్రవాద మూలాలను లక్ష్యంగా చేసుకుంది. సరిహద్దులు దాటి వెళ్లి శత్రువులకు తగిన సమాధానం ఇచ్చి, దేశం తన శక్తిని ప్రపంచానికి చాటింది. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం కేవలం మాటల్లో కాకుండా కార్యరూపంలో ఉందని ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టం అయింది.
Pahalgam Terror Attack | పహల్గాం ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం
ఈ దాడి వార్షికోత్సవం సందర్భంగా పహల్గాం ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. లిడ్డర్ నది తీరంలో మరణించిన 26 మంది స్మారకార్థం నిర్మించిన స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనపై చర్చలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy)లో “The Human Cost of Terrorism” పేరుతో నిర్వహిస్తున్న ప్రదర్శన ఉగ్రవాద దుష్పరిణామాలను ప్రపంచానికి తెలియజేస్తోంది.దేశవ్యాప్తంగా బాధితుల కుటుంబాలకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.మరోవైపు రక్తంతో తడిసిన నేలపై… ఓ దేశ భక్తురాలు ఘనంగా నివాళులు అర్పించింది.

Pahalgam Terror Attack | అమాయకుల రక్తంతో
ఒక సంవత్సరం క్రితం ప్రకృతి సోయగాలతో మెరిసే పహల్గామ్ నేల… అమాయకుల రక్తంతో కలుషితమైంది. ఈ రోజు, అదే నేలపై నా కుమార్తె అక్షర నిలబడి… భిన్నమైన సింధూరాన్ని అర్పిస్తోంది . అది ఒక కుమార్తె ఇచ్చే పవిత్ర నివాళి. ఆమె “వందే మాతరం” పాటకు నృత్యం చేస్తూ… ఆ నేలను మళ్లీ మనది అని ప్రకటిస్తోంది. మనల్ని కుంగదీసే ప్రయత్నం చేసిన వాళ్లకు… మన స్పందన, మన సంస్కృతి, మన ధైర్యం ఇంకా బలంగా ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

