అక్షరటుడే వెబ్డెస్క్: Anti Paper Leak Bill | పరీక్షల్లో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు , వ్యవస్థాగత మోసాలను కఠినంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’ లోక్సభలో ( Lok Sabha )ఆమోదం పొందింది. విపక్షాల గందరగోళం మధ్యే ఈ బిల్లుకు మూజువాణి ఓటు లభించింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా లోక్సభను రేపటికి వాయిదా వేశారు.
Anti Paper Leak Bill | కఠిన జైలు శిక్షలు..
ఇక నుంచి పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులు, గ్యాంగ్లు , అధికారులకు విధించే కనీస జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీలు, సంస్థలు, ముఠాలు ఈ తప్పు చేస్తే వారికి రూ.5 కోట్ల వరకు భారీ జరిమానా పడుతుంది. అంతేకాకుండా, ఆ పరీక్ష నిర్వహణకు అయిన మొత్తం ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేస్తారు.
Anti Paper Leak Bill | ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు..
పేపర్ లీక్ కేసులను వేగవంతంగా విచారించడానికి కొత్తగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, వాటిలో రోజువారీ ప్రాతిపదికన విచారణ జరుపుతారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఈ కేసుల విచారణను కేవలం 2 నెలల్లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, రాష్ట్రాల సరిహద్దులు దాటి జరిగే పెద్ద ఎత్తున పరీక్షల మోసాలను విచారించడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసే అధికారాన్ని కేంద్రానికి కల్పించారు.
Anti Paper Leak Bill | నిషేధ కాలం పొడిగింపు..
అక్రమాలకు బాధ్యులైన పరీక్షా నిర్వహణ ఏజెన్సీలపై విధించే నిషేధ కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచారు. ఇటీవల నీట్ (NEET-UG) వంటి పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న వివాదాలు, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును, విద్యా వ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ఇదొక చారిత్రాత్మక, కీలక అడుగు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫైనల్ ట్రీట్మెంట్.. ఆ 5 గంటలే అత్యంత కీలకం