అక్షరటుడే, వెబ్డెస్క్: Pawan Kalyan Karma | “రాజకీయాల్లో ఎవరు తప్పు చేసినా కర్మ అనేది వదలదు. గతంలో ఎవరు ఎలాంటి పనులు చేశారో.. దానికి తగిన ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు” అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘న్యూటన్ థర్డ్ లా’ ప్రకారం ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకుల అరెస్టులు, జైలు వ్యవహారాలపై వస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. కొందరు తనపై కావాలనే దిగజారుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Pawan Kalyan Karma | వ్యవస్థలకు అన్నీ తెలుసు..
కోర్టులు, ఏసీబీ కోర్టులు, సుప్రీం కోర్ట్ జడ్జీలకు ఎవరు నేరం చేశారో, ఎవరు తప్పు చేశారో అన్నీ స్పష్టంగా తెలుసని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“నేను ప్రత్యేకంగా వ్యవస్థలను కూర్చోబెట్టి ఎవరిని జైల్లో పెట్టాలో, ఎవరిని అరెస్ట్ చేయాలో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని ఆయన తేల్చి చెప్పారు.
Pawan Kalyan Karma | ఆ దిగజారుడు మైండ్ సెట్ నాకు లేదు
వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళిపోవాలని, వారు అరెస్ట్ అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు కొందరు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి దిగజారుడు మైండ్ సెట్తో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Pawan Kalyan Karma | ఢిల్లీ పర్యటనల ఉద్దేశం అది కాదు!
తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతుండటంపై వస్తున్న ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు.
ప్రతిపక్ష నాయకుల జైలు విషయాల గురించి మాట్లాడటానికి తాను ఢిల్లీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
దేశ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించడమే తన ఢిల్లీ పర్యటనల ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
చివరగా, తప్పు చేసిన వారు చట్టం నుండి, ప్రకృతి నియమమైన ‘కర్మ’ నుండి తప్పించుకోలేరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.


