అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Tobacco Awareness | పొగాకు వినియోగ నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ (Medicover Hospitals) పల్మనాలజిస్ట్ ప్రశాంత్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
Tobacco Awareness | సిగరెట్లు, గుట్కా, బీడీలు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిగరెట్లు(Cigarettes), బీడీలు, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), క్షయవ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. ధూమపానం చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా, వారి చుట్టూ ఉండే కుటుంబ సభ్యులు, చిన్నారులు కూడా పాసివ్ స్మోకింగ్ కారణంగా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను ఆకర్షణీయంగా ప్రచారం చేసే ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు.
ఇటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు అలవాటు నుంచి బయటపడేందుకు దృఢ సంకల్పంతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు, వైద్య నిపుణుల సలహాలు, అవసరమైతే ప్రత్యేక చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. సరైన సమయంలో పొగాకు వినియోగాన్ని మానివేయడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ పొగాకు రహిత జీవన విధానాన్ని అవలంబించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలన్నారు.


ఇది కూడా చదవండి: Cyber Crime Inspector | రక్షకుడే భక్షకుడైతే సామాన్యులకు రక్షణ ఎక్కడ..? రూ. లక్షల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్


