అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణ చేపట్టడానికి, మెట్రో ఫేజ్ -I స్వాధీనం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు షరతులన్నింటినీ పూర్తి చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి AshwiniVaishnaw దృష్టికి తీసుకెళ్లి, ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు ఇప్పించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి kishan reddy ని ముఖ్యమంత్రి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాశారు.
Hyderabad Metro Phase 2 | రుసుముగా రూ. 84.32 కోట్ల చెల్లింపు
మెట్రో స్వాధీనం కోసం అమలులో ఉన్న ఆర్థిక ఒప్పందాల ప్రకారం, IRFC అంగీకరించిన మేరకు తొలి విడత రుణాన్ని జూన్ 15, 2026 న విడుదల చేయాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వం ముందస్తు షరతులను పూర్తి చేయడమే కాకుండా ఐఆర్ఎఫ్సీ కోరిన మేరకు ముందస్తు రుసుముగా రూ. 84.32 కోట్ల చెల్లించినట్టు ముఖ్యమంత్రి ఆ లేఖలో వివరించారు.
ఒప్పంద ప్రక్రియ మేరకు అన్నింటినీ పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు విడుదల కాలేదని లేఖలో కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

Hyderabad Metro Phase 2 | మెట్రో రైల్ ఫేజ్ -2 విస్తరణ
మెట్రో స్వాధీన ప్రక్రియ, సంతకాలు చేసిన ఒప్పందం, ప్రతిపాదిత హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2 విస్తరణకు సంబంధించి ఇంకా ఏవైనా సమాచారం కావలసినా, వివరణలు అవసరమైనా, సంబంధిత అధికారులతో కలిసి అనుకూలమైన సమయం, ప్రదేశంలో వ్యక్తిగతంగా కలిసి అన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ఆ లేఖలో స్పష్టం చేశారు.
ఐఆర్ఎఫ్సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వీలైనంత తొందరగా మంజూరు చేయాలని కిషన్ రెడ్డి ని కోరారు.
Hyderabad Metro Phase 2 | సమావేశాన్ని ఏర్పాటు చేయండి
“అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ అంశం పరిష్కారానికి సంబంధించి జరిగే ఏ సమావేశానికైనా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. కేంద్ర రైల్వే శాఖ మంత్రి AshwiniVaishnaw తో వీలైనంత త్వరగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఆ సమావేశానికి సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో హాజరై, ఏవైనా సందేహాలు, సమస్యలను నివృత్తి చేసి, ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేలా సహకరిస్తాను..” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మెట్రో రైలు ఫేజ్ -1 అంశాలతో పాటు ఫేజ్ -2 లో భాగంగా నగరంలో ఏడు కారిడార్లను కవర్ చేస్తూ సుమారు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కి.మీ మేరకు విస్తరణ చేపట్టాల్సిన మెట్రో ఫేజ్-2 వివరాలను ముఖ్యమంత్రి రాసిన ఏడు పేజీల లేఖలో సమగ్రంగా వివరించారు.