అక్షరటుడే, వెబ్డెస్క్: ABVP Protest | హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ABVP Protest | బడులు మూయొద్దు..
రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. మరోవైపు సుమారు 23 వేల పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే విద్యకు ప్రధాన ఆధారమని, వాటిని బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసే చర్యలు ఆందోళనకరమని పేర్కొన్నారు.

ABVP Protest | ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి..
ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అధిక ఫీజుల భారం నుంచి తల్లిదండ్రులను రక్షించేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్య వ్యాపారంగా మారకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ABVP Protest | తోపులాట.. ఠాణాలకు తరలింపు..
ధర్నా సందర్భంగా కొందరు ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
రోడ్డెక్కే పరిస్థితి రావడం బాధాకరం
విద్య ప్రతి పేద విద్యార్థి హక్కు అని, ఆ హక్కు కోసం విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఆందోళనకారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన, అందరికీ అందుబాటులో ఉచిత నాణ్యమైన విద్య లక్ష్యంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.