అక్షరటుడే వెబ్డెస్క్: Passport Citizenship Proof | పాస్పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది భారత పౌరసత్వానికి ఎలాంటి ధృవీకరణ పత్రం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కొత్తగా తీసుకున్నది కాదని, దశాబ్దాలుగా అమలులో ఉన్న చట్టం ప్రకారమే ఈ వివరణ ఇచ్చామని కేంద్రం పేర్కొంది.
Passport Citizenship Proof | చట్టం ఏం చెబుతోంది?
కేంద్రం తన వివరణలో ‘పాస్పోర్ట్ చట్టం, 1967’ లోని సెక్షన్ 20ని ప్రస్తావించింది. పౌరులు కాని వారికి కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రయాణ పత్రాలను జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఈ చట్టం కల్పిస్తోంది. కాబట్టి, పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని భారత పౌరుడిగా పరిగణించలేమని ప్రభుత్వం వివరించింది. 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించిందని గుర్తుచేసింది.
Passport Citizenship Proof | విపక్షాల ఆగ్రహం..
పాస్పోర్ట్ ( Passport )సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆధార్, పాన్, ఓటర్ కార్డులు పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు పాస్పోర్ట్ను కూడా ఆ జాబితాలో చేర్చడంపై విపక్ష నాయకులు (ఆదిత్య థాక్రే, కపిల్ సిబల్, జావీద్ అక్తర్ తదితరులు) సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. “మరి ఈ దేశంలో పౌరసత్వానికి అసలైన రుజువు ఏది?” అని వారు నిలదీస్తున్నారు.

Passport Citizenship Proof | బీజేపీ స్పందన..
విపక్షాల విమర్శలను బీజేపీ నేత అమిత్ మాలవీయ కొట్టిపారేశారు. విదేశాంగ శాఖ కొత్త విధానాన్ని ఏదీ ప్రకటించలేదని, కేవలం పాత చట్టంలోని నిబంధనలనే గుర్తు చేసిందని చెప్పారు. ‘పౌరసత్వ చట్టం, 1955’ ప్రకారం భారతదేశంలో పౌరసత్వాన్ని నిర్ధారిస్తారని తెలిపారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల పౌరసత్వ రికార్డులు, పాఠశాల ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డులు , పాస్పోర్ట్ వంటి వివిధ ఆధారాలను బట్టి పౌరసత్వాన్ని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయంగా ఈ అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. పౌరసత్వం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Emergency Day Observance | అధికారం కోసం నియంతగా మారినా ఇందిరాగాంధీ : ధన్పాల్