అక్షరటుడే వెబ్డెస్క్: Sheikh Hasina Return | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై మరణశిక్ష వంటి కఠినమైన తీర్పులు ఉన్నప్పటికీ, ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్ ( Bangladesh )తిరిగి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.
Sheikh Hasina Return | నా గడ్డపైనే ప్రాణం పోవాలి..
“నేను బంగ్లాదేశ్లో అడుగుపెట్టగానే నన్ను అరెస్ట్ చేయవచ్చు లేదా చంపేయవచ్చు. ఏది జరిగినా సరే, నేను వెళ్లాల్సిందే” అని హసీనా పేర్కొన్నారు. 2024 ఆగస్టులో జరిగిన భారీ విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తనతో పాటు దేశం దాటిన అవామీ లీగ్ పార్టీ ముఖ్య నేతలందరూ డిసెంబర్లో స్వదేశానికి చేరుకుని, కోర్టుల ముందు లొంగిపోతామని ఆమె తెలిపారు. ఒకవేళ తనకు మరణం ఎదురైతే, అది తన తల్లిదండ్రుల రక్తం చిందిన స్వంత గడ్డపైనే జరగాలని కోరుకుంటున్నానని ఆమె భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
Sheikh Hasina Return | ట్రిబ్యునల్ మరణశిక్ష..
2024 ఉద్యమ కాలంలో జరిగిన అణచివేత, ఆందోళనకారులపై కాల్పుల ఘటనల్లో మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) గతంలోనే షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్కు కూడా మరణశిక్ష పడగా, పలువురు ఉన్నతాధికారులకు జైలు శిక్షలు పడ్డాయి. వీరితో పాటు హసీనా , మాజీ హోంమంత్రి ఆస్తులను జప్తు చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
Sheikh Hasina Return | అండగా ఉండటమే తన లక్ష్యమని..
ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఈ తిరుగు ప్రయాణంపై ఎలాంటి చర్చలు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. తన పార్టీ కార్యకర్తలు స్వదేశంలో తీవ్ర అణచివేతకు గురవుతున్నారని, వారికి అండగా ఉండటమే తన లక్ష్యమని ఆమె సంకేతాలిచ్చారు. డిసెంబర్లో ఆమె తిరుగు ప్రయాణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి అనూహ్య మలుపులకు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Telangana Manufacturing Investment | తయారీ రంగానికి తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్బాబు