Ebola Virus Outbreak | ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా కొత్త స్ట్రెయిన్.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Virus Outbreak | ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి (PHEIC)గా ప్రకటించింది. ఈ వ్యాప్తి పొరుగు దేశాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Ebola Virus Outbreak | కల్లోలం రేపుతున్న అరుదైన ‘బండిబుగ్యో’ స్ట్రెయిన్..

అమెరికా వ్యాధి నిరోధక సంస్థ (CDC) నివేదిక ప్రకారం.. కాంగోలో ప్రస్తుతం 11 నిర్ధారిత కేసులు, 336 అనుమానిత కేసులు ఉండగా, ఇప్పటివరకు 88 మంది మరణించారు. అయితే, అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం మరణాల సంఖ్య ఇప్పటికే 118 దాటినట్లు తెలుస్తోంది. ఈసారి వ్యాప్తికి ‘బండిబుగ్యో’ (Bundibugyo) అనే అరుదైన ఎబోలా జాతి కారణమని వైద్యులు గుర్తించారు. సాధారణంగా కనిపించే జైర్ స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ, ఈ బండిబుగ్యో స్ట్రెయిన్‌కు ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందిన టీకాలు లేదా ప్రత్యేక చికిత్సలు లేకపోవడం వైద్యులను కలవరపెడుతోంది. గతంలో ఈ స్ట్రెయిన్ బారిన పడిన వారిలో మరణాల రేటు 30శాతం నుండి 50 శాతం వరకు ఉందని WHO స్పష్టం చేసింది.

Ebola Virus Outbreak | సరిహద్దులు దాటుతున్న వైరస్..

వైరస్ ఇప్పటికే కాంగో సరిహద్దులు దాటి ఉగాండాకు చేరింది. ఉగాండా రాజధాని కంపాలాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు కాంగోలో చికిత్స అందిస్తున్న నలుగురు ఆరోగ్య కార్యకర్తలు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక వైద్య సేవలు తీవ్ర ఒత్తిడిలో పడ్డాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా ఆరోగ్య శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. గత 21 రోజుల్లో ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్ దేశాల్లో పర్యటించిన అమెరికేతర పౌరులపై తాత్కాలికంగా ప్రవేశ ఆంక్షలు విధించింది. అలాగే కాంగోలో ప్రత్యేక ఎబోలా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు WHO నిపుణుల బృందాన్ని రంగంలోకి దించుతోంది.

Ebola Virus Outbreak | భారత్‌కు ఎలాంటి ముప్పు లేదు

ఈ అంతర్జాతీయ పరిణామాలపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశానికి ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులలో నిఘా , తనిఖీలను పటిష్టం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి:  Supreme Court on Street Dogs | వీధి కుక్కల విషయంలో సుప్రీం కీలక తీర్పు..

 

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *