అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Update | రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నాయి. బుధవారం సైతం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
వానాకాలం మొదలైన నాటి నుంచి వర్షాలు లేక అల్లాడుతున్న ప్రజలకు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానలు ఊరటనిచ్చాయి. ముఖ్యంగా పంటల సాగుపై ఆశలు వదులుకున్న రైతులకు కొత్త ఊపిరినిచ్చాయి. ఇప్పటికే వేసిన వరినాట్లకు ప్రాణం పోశాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Weather Update | రోజంతా ముసురు
రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంటుంది. రోజంతా ముసురు పడుతుంది. ఆదిలాబాద్ (Adilabad), నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సాయత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో ఉదయం నుంచి ముసురు, తేలికపాటి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Update | వర్షపాతం వివరాలు
తెలంగాణలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా నందిగామలో 59 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా జైనద్లో 49.8, జగిత్యాల జిల్లా బీర్పూర్ 44, మంచిర్యాల జిల్లా జన్నారంలో 41, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 37.8మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఇన్ని రోజులు వర్షాలు లేక వరినాట్లు సాగలేదు. నాలుగు రోజుల నుంచి వానలు పడుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. వరినాట్లు వేయడానికి సిద్ధం అవుతున్నారు.
దీనిని కూడా చదవండి : Rahul Gandhi Assets Case | రాహుల్ గాంధీ ఆస్తుల కేసు : సీబీఐకి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు