అక్షరటుడే వెబ్డెస్క్: NHAI ambulance rule | నేషనల్ హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు త్వరితగతిన అత్యవసర వైద్యం అందించేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద వార్త తెలిసిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోవాలని కఠిన గడువు విధించింది. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే ప్రతి ఘటనకు రూ.10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
NHAI ambulance rule | కొత్త మార్గదర్శకాల వివరాలు..
జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన ప్రదేశం అంబులెన్స్ ( Ambulance )ఉన్న ప్రాంతానికి 10 కి.మీ పరిధిలో ఉంటే 10 నిమిషాల్లోపు అక్కడకు చేరుకోవాలి. ఒకవేళ దూరం ఎక్కువగా ఉంటే దానికి తగినట్లుగా సమయం మారుతుంది. ఈ రాకపోకలను జీపీఎస్ డేటా, ఎన్హెచ్ఏఐ కేర్ డ్యాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.
అత్యవసర కాల్ స్వీకరించిన సమయం నుంచి సరిగ్గా 1 గంటలోపు బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా రూ.10,000 పెనాల్టీ పడుతుంది. అలాగే, ఎమర్జెన్సీ కాల్స్ను తిరస్కరించినా, అంబులెన్స్లో ఒప్పందం ప్రకారం అవసరమైన వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది అందుబాటులో లేకపోయినా రూ.10 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
NHAI ambulance rule | అందుబాటులో 3 వేల అంబులెన్స్లు..
ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు ఎన్హెచ్ఏఐ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ పరిధిలోని హైవే నెట్వర్క్లో సుమారు 3 వేల అంబులెన్స్లు, 1,000 క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలు సేవలు అందిస్తున్నాయి. వీటన్నింటికీ జీపీఎస్ పరికరాలతో పాటు ఐవోటీ (IoT) సిమ్తో కూడిన ప్రత్యేక ఆండ్రాయిడ్ డివైజ్లను అమర్చారు. రహదారి ప్రమాదాల సమయంలో సహాయం కోసం బాధితులు వెంటనే 1033 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి సాయం పొందవచ్చని ఎన్హెచ్ఏఐ సూచించింది.
ఇది కూడా చదవండి: Govindpet Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం