అక్షరటుడే, కామారెడ్డి : Rice Millers Vigilance Raids | జిల్లాలో(Nizamabad) రైస్ మిల్లర్ల అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా రూ.కోట్ల మేర దారి మళ్లించిన వ్యవహారంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు.
Rice Millers Vigilance Raids |కామారెడ్డిలో ఏకకాలంలో పలు రైస్మిల్లర్లపై..
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 19 రైస్ మిల్లుల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా అందులో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనే సుమారు రూ.19.73 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా జిల్లాలోని పలు మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సోమవారం కూడా కామారెడ్డితో పాటు మరొక మండలంలో రెండు ప్రముఖ రైస్ మిల్లులపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ప్రభుత్వం సరఫరా చేసిన వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్మేసి స్థిరాస్తులు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలిందని సమాచారం.
Rice Millers Vigilance Raids | పలువురి అరెస్ట్..!
ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన కామారెడ్డితో పాటు ఓ మండలంలోని మిల్లుల యాజమాన్యాలను అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇందులో ఓ రైస్ మిల్ యజమాని రూ.40 లక్షల దుర్వినియోగానికి పాల్పడినట్టువ తెలుస్తోంది. దాంతో అతన్ని రిమాండ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా జిల్లాలోని మరికొన్ని మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి జిల్లాలో 2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 20 మంది మిల్లర్లు సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, అంటే దాదాపు రూ.91 కోట్ల విలువైన స్టాక్ను ప్రభుత్వానికి అప్పగించకుండా డీఫాల్టర్లుగా మారినట్లు సమాచారం.
Rice Millers Vigilance Raids | ప్రభుత్వానికి నష్టం కలిగించిన..
ప్రభుత్వానికి నష్టం కలిగించిన మిల్లు యజమానులు తమ ఆస్తులను ఇతరుల పేరు మీదకు మార్చకుండా, విక్రయించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు విజిలెన్స్ అధికారులు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులు, అరెస్టులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. జిల్లా వ్యాప్తంగా మిల్లర్లలో తనిఖీలతో గుబులు మొదలైందని, స్వాహా చేసిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు కొందరు మిల్లర్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: 🔥 ఊహించని ట్విస్ట్..! ‘ఇరుముడి’తో రవితేజ బిగ్ కంబ్యాక్ ఇచ్చారా? 😱