అక్షరటుడే వెబ్డెస్క్: PIMS Hospital Fire | పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ( Islamabad ) ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గైనకాలజీ విభాగం వార్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో వార్డులో చికిత్స పొందుతున్న 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోనే అతిపెద్ద, ఆధునిక వసతులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిగా పేరున్న PIMSలో ఈ దుర్ఘటన జరగడం దిగ్భ్రాంతికరమని ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ అనీజా జలీల్ ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర శ్రమతో మంటలను అదుపు చేశాయి.
PIMS Hospital Fire | కారణాలు, విచారణ..
ఎయిర్ కండిషనర్ (AC) యూనిట్లోని ఆక్సిజన్ కంప్రెసర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ప్రమాదానికి అసలు కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంపై ఈ ఘటనతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
PIMS Hospital Fire | ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి..
ఈ హృదయ విదారక ఘటనపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమాయక శిశువులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించిన ప్రధాని, మృతి చెందిన శిశువుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇది కూడా చదవండి: Khelo India Youth Games | ఖేలో ఇండియా యువజన క్రీడల వేదికగా ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం