అక్షరటుడే వెబ్డెస్క్: Iron Ore Waste | వ్యవసాయ రంగంలో ఇనుప ఖనిజ వ్యర్థాల (ఐఓటీ) సుస్థిర వినియోగంపై అధునాతన పరిశోధనలు చేసేందుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐకార్-ఐఏఆర్ఐ)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలో సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.
Iron Ore Waste | ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు..
గతేడాది ఈ రెండు సంస్థలు వ్యవసాయంలో ఇనుప ఖనిజ వ్యర్థాల వినియోగంపై జరిపిన ప్రాథమిక అధ్యయనాలు మంచి ఫలితాలనిచ్చాయి. ఈ వ్యర్థాలలో సిలికా, ఐరన్ ఆక్సైడ్లు, అల్యూమినా, కాల్షియం, మెగ్నీషియంతో పాటు పంటల ఉత్పత్తికి, నేల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నట్లు తేలింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ, ఛత్తీస్గఢ్లోని కిరండుల్లో నిర్వహించిన ప్రయోగాల్లో వరి, గోధుమ, కూరగాయల సాగుకు ఇవి ఉపకరిస్తాయని వెల్లడైంది.
Iron Ore Waste | దీర్ఘకాలిక పరిశోధనల లక్ష్యం..
తాజా ఒప్పందంలో భాగంగా.. పంటల ఎదుగుదల, పోషకాల లభ్యత, పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై పలు సీజన్ల పాటు దీర్ఘకాలిక శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించనున్నారు. మైనింగ్ వ్యర్థాలను సురక్షితంగా వ్యవసాయానికి ఉపయోగించడం ద్వారా వాటిని నిల్వ చేయాల్సిన భారం తగ్గడంతో పాటు, సహజ వనరుల పరిరక్షణకు, రసాయన ఎరువుల వాడకం తగ్గడానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సంస్థ టెక్నాలజీ డైరెక్టర్ హిరూ ఇషిబాషి, ప్రధాన పరిశోధకుడు డాక్టర్ భూపిందర్ సింగ్ తదితరులు ఈ సహకారం పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయానికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Sneha Society Services | స్నేహా సొసైటీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి