Ahuti MK-2 Drone | 498 కిమీ వేగం.. ఆకాశంలో ‘ఆహుతి’ రికార్డు.. బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నుంచి మరో సంచలనం!

గాలిలోకి దూసుకొచ్చే ప్రమాదకర డ్రోన్లను ఇంటర్‌సెప్ట్‌ చేయడమే లక్ష్యంగా ‘ఆహుతి ఎంకే-2’ను అభివృద్ధి చేసినట్లు అపోలియన్‌ డైనమిక్స్‌ వెల్లడించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahuti MK-2 Drone | ఆకాశంలో దూసుకొచ్చే శత్రు డ్రోన్‌ను గుర్తించి.. అది లక్ష్యాన్ని చేరకముందే అడ్డుకోవడం! ఆధునిక యుద్ధరంగంలో అత్యంత కీలకంగా మారిన ఈ సాంకేతికతలో హైదరాబాద్‌కు చెందిన ఓ రక్షణ స్టార్టప్‌ సరికొత్త మైలురాయిని అందుకుంది.

Ahuti MK-2 Drone | ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఇంక్యుబేట్‌ అవుతున్న అపోలియన్‌ డైనమిక్స్‌ రూపొందించిన ‘ఆహుతి ఎంకే-2’ మల్టీరోటర్‌ ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్‌ గంటకు 498 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని రికార్డు సృష్టించింది.

ఈ వేగంతో ‘ఆహుతి ఎంకే-2’కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఒక మల్టీరోటర్‌ డ్రోన్‌ ఈ స్థాయి వేగాన్ని అందుకోవడం దక్షిణాసియాలోనే ఇదే తొలిసారిగా సంస్థ పేర్కొంది.

Ahuti MK-2 Drone | ఏడాదిలోనే 300 నుంచి 498 కిమీకి..

‘ఆహుతి’ ప్రాజెక్టు ప్రయాణం కూడా ఆసక్తికరమే. తొలిదశలో రూపొందించిన ఆహుతి డ్రోన్‌ 2025లో సుమారు 300 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. అక్కడితో ఆగకుండా డిజైన్‌, ప్రొపల్షన్‌, నియంత్రణ వ్యవస్థలు, విమాన పరీక్షల్లో చేసిన మార్పులతో కేవలం ఏడాది వ్యవధిలో వేగాన్ని భారీగా పెంచి ఆహుతి ఎంకే-2ను 498 కిలోమీటర్ల వేగ సామర్థ్యానికి తీసుకెళ్లినట్లు సంస్థ తెలిపింది.

అంటే తొలి వెర్షన్‌తో పోలిస్తే దాదాపు 66 శాతం వేగాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలిచింది.

Ahuti MK-2 Drone | డ్రోన్‌ను డ్రోన్‌తోనే ఎదుర్కొనే టెక్నాలజీ

చౌకగా తయారయ్యే డ్రోన్లు, లాయిటరింగ్‌ మ్యూనిషన్లు ఆధునిక యుద్ధాల్లో కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా షాహెద్‌ తరహా దాడి డ్రోన్లను ఎదుర్కోవడానికి తక్కువ ఖర్చుతో, వేగంగా స్పందించగల రక్షణ వ్యవస్థల అవసరం పెరుగుతోంది.

Nizamabad prohibited land | నిషేధిత భూమికి ఏడుగురు నకిలీ ‘ఓనర్లు’!.. అర్సపల్లిలో రూ. కోట్ల విలువైన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం..సబ్-రిజిస్ట్రార్‌ అరెస్టు

ఈ నేపథ్యంలో గాలిలోకి దూసుకొచ్చే ప్రమాదకర డ్రోన్లను ఇంటర్‌సెప్ట్‌ చేయడమే లక్ష్యంగా ‘ఆహుతి ఎంకే-2’ను అభివృద్ధి చేసినట్లు అపోలియన్‌ డైనమిక్స్‌ వెల్లడించింది. వేగం ఈ వ్యవస్థకు ప్రధాన బలంగా నిలుస్తోంది.

Ahuti MK-2 Drone | హైదరాబాద్‌ నుంచే రక్షణ టెక్నాలజీ ప్రయోగాలు

అపోలియన్‌ డైనమిక్స్‌ను జయంత్‌ ఖత్రి, సౌర్య చౌదరి స్థాపించారు. 2025లో ఏర్పాటైన ఈ స్టార్టప్‌ ప్రస్తుతం బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఇంక్యుబేట్‌ అవుతోంది. భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారించింది.

‘ఆహుతి ఎంకే-2’ అభివృద్ధిలో అమన్‌ విరాణి (షాడీ), మానస్‌ విచారే, ఇషాన్‌ సూరి కీలకంగా వ్యవహరించినట్లు సంస్థ తెలిపింది. డ్రోన్‌ పైలట్‌గా అనుభవం ఉన్న అమన్‌ విరాణి విమాన పరీక్షలు, అభివృద్ధి ప్రక్రియలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు.

ఇప్పటికే భారత సైన్యానికి కొన్ని మానవరహిత వ్యవస్థలను అందించినట్లు సంస్థ వెల్లడించింది.

Ahuti MK-2 Drone | చిన్న స్టార్టప్‌.. పెద్ద రికార్డు

రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో.. హైదరాబాద్‌లోని యువ స్టార్టప్‌ సాధించిన ఈ రికార్డు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయోగశాల నుంచి యుద్ధరంగ అవసరాలకు ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా భారత స్టార్టప్‌లు వేగంగా అడుగులు వేస్తున్నాయనడానికి ‘ఆహుతి ఎంకే-2’ మరో ఉదాహరణగా నిలిచింది.

498 కిలోమీటర్ల వేగం.. మల్టీరోటర్‌ విభాగంలో రికార్డు.. భారత రక్షణ అవసరాల కోసం స్వదేశీ పరిష్కారం—ఈ మూడు అంశాలు ‘ఆహుతి ఎంకే-2’ను దేశ రక్షణ టెక్నాలజీ రంగంలో ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలబెట్టాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *