అక్షరటుడే, అరుణాచలం: Arunachalam Girivalam | ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం (Arunachaleswara Temple) చిత్ర పౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) చేసేందుకు ఆలయ యంత్రాంగం శుభ ముహూర్తాన్ని ప్రకటించింది.
Arunachalam Girivalam | గిరి ప్రదక్షిణ సమయం ఇదే..
ఆలయ అధికారుల ప్రకటన ప్రకారం.. చిత్ర పౌర్ణమి గిరి ప్రదక్షిణ సమయం ఏప్రిల్ 30 (గురువారం) రాత్రి 9:52 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు మే 1 (శుక్రవారం) రాత్రి 11:08 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు 14 కిలోమీటర్ల మేర ఉన్న గిరి మార్గంలో ప్రదక్షిణ చేసి తమ మొక్కులు తీర్చుకోవచ్చని సూచించారు.
Arunachalam Girivalam | ప్రత్యేక పూజలు, అభిషేకాలు:
మే 1వ తేదీ శుక్రవారం రోజు చిత్తరై మాస పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచి, అరుణాచలేశ్వరుడికి, ఉన్నామలై అమ్మవారికి పాలు, పెరుగు, పన్నీరు, తేనె, పంచామృతాలతో మహా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు.
భారీ ఏర్పాట్లు : ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమికి సుమారు 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గిరి మార్గంలో తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

