అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Inter Supplementary Exams | జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు (Intermediate Advanced Supplementary) పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
Inter Supplementary Exams | జిల్లావ్యాప్తంగా 17,789 మంది విద్యార్థులు..
జిల్లావ్యాప్తంగా 17,789మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు. ఫస్టియర్ పరీక్షలకు 11,425 మంది, సెకండియర్ పరీక్షలకు 6,364 మంది హాజరుకానున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు, సాయంత్రం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయన్నారు. వార్షిక పరీక్షల తరహాలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా సజావుగా, పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Inter Supplementary Exams | లోటుపాట్లకు తావివ్వకుండా..
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రతీ అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ తుది ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలనాధికారి ఆదేశించారు. ముఖ్యంగా ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పోలీస్ (Nizamabad Police), ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర లైన్ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని సూచించారు.
Inter Supplementary Exams | వేసవికాలం దృష్ట్యా..
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా రక్షిత మంచినీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలన్నారు. మూడు పరీక్షా కేంద్రాలకు ఒకటి చొప్పున 108 అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.
పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్, నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: TVK Vijay | విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. ఆ పార్టీల మద్దతు

