అక్షరటుడే, వెబ్డెస్క్: NEET 2026 Paper Leak | దేశంలో వైద్య విద్యకు అత్యంత కీలకమైన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ-2026 చుట్టూ ఇప్పుడు భారీ వివాదం నెలకొంది. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రాజస్థాన్ (Rajasthan)లోని సికార్ ప్రాంతంలో ఈ వ్యవహారం బయటపడటంతో రాష్ట్ర పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మే 3న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష (NEET UG Exam) నిర్వహించగా, మే 2 రాత్రే కొందరు విద్యార్థులకు ఒక ‘గెస్ పేపర్’ సర్క్యులేట్ అయినట్లు సమాచారం. పరీక్ష పూర్తయ్యాక ఆ గెస్ పేపర్లోని ప్రశ్నలను అసలు ప్రశ్నపత్రంతో పోల్చి చూడగా, బయాలజీ మరియు కెమిస్ట్రీ విభాగాల్లో 100కు పైగా ప్రశ్నలు దాదాపు పూర్తిగా సరిపోలినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో ప్రశ్నాపత్రం లీక్ జరిగిందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
NEET 2026 Paper Leak | లోతుగా విచారణ..
ఈ ఘటనపై కొందరు విద్యార్థులు సికార్లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనంతరం రాజస్థాన్ డీజీపీ ఆదేశాల మేరకు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (Rajasthan Special Operations Group), యాంటీ టెర్రరిజం స్వ్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ప్రశ్నపత్రం ఎలా లీక్ అయింది, దీనికి వెనుక ఉన్న నెట్వర్క్ ఎవరు అనే కోణాల్లో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుమారు 8 నుంచి 13 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, మధ్యవర్తులు కూడా విచారణ పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
NEET 2026 Paper Leak | ఇది కేవలం అంచనా పేపర్ మాత్రమేనా?
విద్యార్థులకు డబ్బుల కోసం ప్రశ్నలు ముందుగానే అందించారా? లేక ఇది కేవలం అంచనా పేపర్ మాత్రమేనా? అనే విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.మరోవైపు ఈ ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) స్పందించింది. మే 7న తమకు ఈ అంశంపై సమాచారం అందిందని, వెంటనే సంబంధిత దర్యాప్తు సంస్థలకు తెలియజేశామని ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షను పూర్తి భద్రతా ప్రమాణాలతో నిర్వహించామని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో కూడా కొన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో లీకేజీ ఆరోపణలు రావడంతో విద్యార్థుల్లో అనుమానాలు పెరిగాయి. ఇప్పుడు నీట్ వంటి అత్యంత కీలక పరీక్షపై కూడా ఇలాంటి వివాదం తలెత్తడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో దర్యాప్తు తుది ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Inter Admissions | యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు.. సీఎం కీలక ఆదేశాలు

