అక్షరటుడే, వెబ్డెస్క్ : AIADMK Split | తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా కొనసాగుతున్న AIADMK పార్టీలో భారీ చీలిక బయటపడింది. మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వంలోని వర్గం ప్రస్తుత ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (TVK Chief Vijay)కు మద్దతు ప్రకటించింది.
డీఎంకేతో చేతులు కలపడానికి పార్టీ నాయకత్వం ప్రయత్నించడం తమకు నచ్చలేదని, అందుకే పళని స్వామి వర్గం నుంచి విడిపోయినట్లు సీవీ షణ్ముగం (C.V. Shanmugam) వెల్లడించారు. తమ వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
AIADMK Split | అసెంబ్లీలో రచ్చకెక్కిన విభేదాలు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో గెలిచినా, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ఇతర పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదే సమయంలో షణ్ముగం నేతృత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం నిర్వహించి విజయ్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో ఇతర మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో ఆ వర్గం అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పడింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అన్నాడీఎంకేలోని వర్గపోరు బహిర్గతమైంది. పళనిసామి (Palaniswami) పార్టీ ప్రధాన బాధ్యతలతో పాటు శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తప్పుకోవాలని షణ్ముగం వర్గం డిమాండ్ చేస్తోంది.
AIADMK Split | మరోసారి పార్టీ చీలిక దిశగా
అసెంబ్లీలో కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిసామికి మద్దతుగా నిలవగా, ఆయన్నే శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు లేఖ ఇచ్చారు. మరోవైపు షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వెలుమణినిని తమ పక్షనేతగా గుర్తించాలని వేరే లేఖ సమర్పించారు. దీంతో స్పీకర్ ఎవరిని అధికారిక నేతగా గుర్తిస్తారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జయలలిత మరణం తర్వాత పార్టీ ఇప్పటికే అనేక అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంది. పననీరు సెల్వం, శశికళ వంటి కీలక నేతలు దూరమైన తర్వాత ఇప్పుడు మరోసారి పార్టీ చీలిక దిశగా వెళ్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Mumbai Water Cut | ముంబయిలో నీటి సంక్షోభ హెచ్చరిక.. మే 15 నుంచి 10 శాతం నీటి కోత

