అక్షరటుడే, వెబ్డెస్క్: Ghost SIM Operation | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డిజిటల్ అరెస్టులు, సెక్స్టార్షన్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వెనుక ఉన్న అసలు గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.
సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధంగా మారిన ‘ఘోస్ట్ సిమ్’ (నకిలీ సిమ్) నెట్వర్క్ల అంతం కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ ను విజయవంతంగా పూర్తి చేశారు.
గతంలో సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్), వారికి సహకరించిన బ్యాంకు అధికారులను టార్గెట్ చేసిన పోలీసులు.. ఈసారి నేరాలకు మూలకేంద్రమైన నకిలీ సిమ్ కార్డుల వ్యవస్థపై ఉక్కుపాదం మోపారు.
Ghost SIM Operation | మెరుపు దాడులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన 18 ప్రత్యేక బృందాలు గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్) ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి.
ఈ ఆపరేషన్లో భాగంగా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పెద్ద మొత్తం (544) లో ఘోస్ట్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Ghost SIM Operation | రూ.101 కోట్ల మోసాలు.. 76 కేసులు!
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ఘోస్ట్ సిమ్ కార్డులను వినియోగించి దేశవ్యాప్తంగా సుమారు 76 భారీ సైబర్ నేరాలు చేసినట్లు గుర్తించారు. వీటి ద్వారా అమాయక ప్రజల నుంచి దాదాపు రూ. 101.87 కోట్ల మేర దోచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
Ghost SIM Operation | ‘సర్వర్ డౌన్’ అని చెప్పి సిమ్లు విదేశాలకు!
అరెస్టయిన వారిలో వివిధ ప్రముఖ టెలికాం సంస్థలకు చెందిన 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లు ఉన్నారు. వీరు సాధారణ కస్టమర్లు సిమ్ కార్డులు లేదా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) కోసం వచ్చినప్పుడు.. ‘నెట్వర్క్ స్లోగా ఉంది’ లేదా ‘ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాలేదు’ అని అబద్ధాలు చెబుతూ, వారి నుంచి అదనంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.
ఆ వివరాలతో కస్టమర్ల ప్రమేయం లేకుండానే అదనపు సిమ్లను యాక్టివేట్ చేస్తారు. అనంతరం వాటిని ‘ఈ-సిమ్’ (e-SIM)లుగా మార్చేసి.. చైనా, కంబోడియా, దుబాయ్ వంటి దేశాల్లో ఉండే అంతర్జాతీయ సైబర్ ముఠాలకు చేరవేస్తారు.
Ghost SIM Operation | పోలీసుల తదుపరి యాక్షన్ ప్లాన్
ఈ ఘోస్ట్ సిమ్ ముప్పును శాశ్వతంగా అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (TSP) ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, కేవైసీ (KYC) ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది.
అలాగే నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), ట్రాయ్ (TRAI) సంస్థలను సంప్రదించనుంది.
ప్రజలకు హైదరాబాద్ పోలీసుల అత్యవసర హెచ్చరిక:
గుర్తింపు కార్డులు, బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్) వివరాలను గుర్తుతెలియని లేదా అనధికారిక ఏజెంట్లకు ఇవ్వకండి. ఒకవేళ సిమ్ తీసుకునేటప్పుడు ఏజెంట్ ‘సర్వర్ డౌన్’ అని మళ్లీ వేలిముద్ర అడిగితే అలర్ట్ అవ్వండి.
మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నాయో తెలుసుకోవడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ [https://tafcop.sancharsaathi.gov.in], (https://tafcop.sancharsaathi.gov.in) ను సందర్శించి తనిఖీ చేసుకోండి.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Albert Viral Smile | “ఒక చిన్నారి నవ్వు… కుటుంబం జీవితాన్నే…


