అక్షరటుడే, వెబ్డెస్క్: Constable Child Marriage Case | చట్టాన్ని రక్షించాల్సింది ఎవరు? సమాజంలో అన్యాయం జరిగితే అడ్డుకోవాల్సింది ఎవరు? కచ్చితంగా పోలీస్ శాఖే.
కానీ, వేలాది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక కానిస్టేబుల్.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, మైనర్ బాలిక జీవితాన్ని బుగ్గిపాలు చేసిన ఘోర ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Constable Child Marriage Case | కంచె చేను మేసిన చందంగా..
యాదాద్రిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాయని అనిల్ కుమార్, బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు.
ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను ఆయన వివాహం చేసుకున్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, సమాజానికి అవగాహన కల్పించాల్సిన స్థానంలో ఉన్న ఒక పోలీసు అధికారే ఈ ఘతుకానికి ఒడిగట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.
Constable Child Marriage Case | ఐసీడీఎస్ అధికారుల చొరవ..
ఈ బాల్య వివాహం గురించి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ (ICDS) అధికారులు తక్షణమే స్పందించారు. బాలిక మైనర్ అని నిర్ధారించుకున్న అనంతరం, వారు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన హుజూర్నగర్ పోలీసులు సదరు కానిస్టేబుల్ నాయని అనిల్ కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Constable Child Marriage Case | శాంతిభద్రతల రక్షకులా? భక్షకులా?
సమాజంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. అలాంటిది చట్టంపై పూర్తి అవగాహన ఉండాల్సిన ఒక కానిస్టేబుల్ ఇలాంటి పనికి పూనుకోవడం సిగ్గుచేటని విమర్శలు వెలువడుతున్నాయి.
సదరు కానిస్టేబుల్పై కేవలం కేసు నమోదు చేయడమే సరిపోదు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చినందుకు గాను ఆయనపై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు (సస్పెన్షన్ లేదా డిస్మిస్) తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వ్యక్తం అవుతోంది.
ఒక మైనర్ బాలికకు పెళ్లి జరుగుతుంటే ఆ కుటుంబ పెద్దలు, సమాజం ఏం చేస్తున్నట్లు? పెళ్లి జరిపించిన పెద్దలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కావనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే ఇలాంటి అరాచకాలకు పాల్పడితే సామాన్య ప్రజలకు వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది? ఉన్నతాధికారులు స్పందించి ఈ కేసులో నిందితుడైన కానిస్టేబుల్కు కఠినమైన శిక్ష పడేలా చూడాలని, తద్వారా సమాజానికి ఒక బలమైన హెచ్చరిక ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


