అక్షరటుడే వెబ్డెస్క్: CBSE Three Language Formula |కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 9వ తరగతి విద్యార్థుల కోసం తీసుకువచ్చిన ‘త్రిభాషా విధానం’ (Three-Language Formula) ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. 9వ తరగతి చదివే విద్యార్థులు మూడు భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాలంటూ సీబీఎస్ఈ జారీ చేసిన తాజా నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉమ్మడిగా ఈ పిటిషన్ను వేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
CBSE Three Language Formula | విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి
విద్యార్థుల పక్షాన న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఇప్పటివరకు సీబీఎస్ఈ విద్యార్థులు 10వ తరగతి వరకు కేవలం రెండు భాషలను (ఇంగ్లీష్తో పాటు హిందీ లేదా ఏదైనా ప్రాంతీయ భాష) మాత్రమే చదువుతున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 9వ తరగతికి రాగానే అకస్మాత్తుగా మరో రెండు అదనపు భాషలను నేర్చుకోవాలనడం విద్యార్థులపై మోయలేని భారం మోపడమే అవుతుంది. అంతేకాకుండా, ఒకేసారి ఇన్ని భాషలు నేర్చుకోవాల్సి రావడం వల్ల, వచ్చే ఏడాది వారు రాయబోయే 10వ తరగతి బోర్డు పరీక్షల ప్రిపరేషన్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది విద్యార్థుల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది” అని రోహత్గి ధర్మాసనానికి వివరించారు. ఈ వాదనలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఈ పిటిషన్ను వచ్చే వారం విచారణ జాబితాలో చేరుస్తామని, దీనిపై త్వరలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
CBSE Three Language Formula | అసలు ఎందుకీ మార్పు?
జాతీయ విద్యా విధానం-2020 (NEP 2020)లో భాగంగా దేశంలో బహుభాషా సంస్కృతిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలతో కలిపి మొత్తం మూడు భాషలు నేర్చుకోవాలని సూచించారు. దీనికి అనుగుణంగానే సీబీఎస్ఈ ఈ సరికొత్త మార్పును ప్రవేశపెట్టింది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా ఈ భారాన్ని పెంచడంపైనే ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Road Funds | తెలంగాణకు మరిన్ని నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క


