అక్షరటుడే వెబ్డెస్క్:AP POLYCET Results| ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక విద్యపై ఆసక్తితో మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు.
AP POLYCET Results | బాలికలదే పైచేయి..
ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికలే తమ సత్తా చాటుతూ పైచేయి సాధించారు. పరీక్ష రాసిన వారిలో మొత్తం 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో బాలికల ఉత్తీర్ణత శాతం అత్యధికంగా 93.57 శాతంగా నమోదైంది. బాలుర విభాగంలో 89.88 శాతం మంది అర్హత పొందారు. గతేడాది కంటే ఈసారి పోటీ పెరిగినప్పటికీ, మెరుగైన ఫలితాలు రావడం పట్ల విద్యాశాఖ సంతృప్తి వ్యక్తం చేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానం..
జిల్లాల వారీగా ఫలితాలను విశ్లేషిస్తే, ఈసారి గిరిజన , మన్యం ప్రాంతాలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా 99.11 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత పోలవరం ప్రాంతం 95.46 శాతంతో రెండో స్థానాన్ని, పార్వతీపురం మన్యం జిల్లా 93.45 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. అర్హత సాధించిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇది కూడా చదవండి: Harvester Fire Accident | కరెంట్ షాక్తో హార్వెస్టర్ దగ్ధం

