అక్షరటుడే వెబ్డెస్క్: Bihar Bank Glitch | పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. తన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ చూసి ఆయన ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ( Muzaffarpur ) జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా అనే వృద్ధుడు తన సామాజిక భద్రతా పింఛను తీసుకోవడానికి ఆదివారం కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన దివ్యాంగుడైన కుమారుడు కూడా వెళ్లారు. పింఛను తీసుకున్న తర్వాత, తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవాలని మిశ్రా నిర్ణయించుకున్నారు. అయితే, తెరపై కనిపించిన అంకెలు చూసి ఆయనతో పాటు అక్కడి ఆపరేటర్ కూడా షాక్ తిన్నారు.
Bihar Bank Glitch | అకౌంట్లో రూ. 759 కోట్లు..
మిశ్రా ఖాతాలో ఏకంగా రూ. 759 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటాన్ని చూసి వారు నమ్మలేకపోయారు. అలాగే, ఆయన కుమారుడి ఖాతాను కూడా తనిఖీ చేయగా, అందులోనూ అంతే స్థాయిలో భారీ మొత్తం కనిపించింది. అలా తండ్రీకొడుకుల ఖాతాల్లో కలిపి మొత్తం రూ. 1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటం స్థానికంగా కలకలం రేపింది.
Bihar Bank Glitch | సాంకేతిక లోపమేనా?
ఖాతాల్లోకి అంత భారీ మొత్తం ఎలా వచ్చిందో తమకేమీ అర్థం కావడం లేదని, ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని వృద్ధుడు బ్యాంకు అధికారులను కోరారు. ఇది ఖచ్చితంగా బ్యాంకు సర్వర్లోని ఏదైనా సాంకేతిక లోపం (Technical Glitch) వల్ల జరిగిన పొరపాటు అయ్యి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏదేమైనా, ఈ వింత ఘటనపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Bheemgal Oora Panduga | భీమ్గల్లో వైభవంగా ‘ఊర పండుగ’