అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bridge Approach Roads | కామారెడ్డి(Kamareddy)–మెదక్(Medak) జిల్లాలను అనుసంధానిస్తూ నిర్మించిన వంతెన త్వరలో వినియోగంలోకి రానుంది. గతంలో నిర్మించిన ఈ వంతెనకు రెండువైపులా అప్రోచ్ రోడ్లు లేక వృథాగా ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతో రెండు జిల్లాలకు మధ్య రాకపోకలు సులువు కానున్నాయి.
Bridge Approach Roads | మెదక్ నియోజకవర్గంలో..
మంజీరా నదిపై హైలెవెల్ బ్రిడ్జి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ. 22.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. గతంలోనే ఇక్కడ వంతెన నిర్మించారు. అప్రోచ్ రోడ్లు లేక మెదక్– కామారెడ్డి జిల్లాలకు అనుసంధానం లేకుండా పోయింది. కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన కారణంగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ నిధులను సాధించుకోగలిగారు. ఈ వంతెన చుట్టూ ఉన్న పది గ్రామాలకు పైగా ఉన్న ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి స్పందించి నిధులు విడుదల చేశారు.
Bridge Approach Roads | 2017లో నిర్మాణం..
మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో మంజీరా నదిపై 2017లో సుమారు రూ.18కోట్లతో 320 మీటర్ల వంతెన నిర్మించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రాంతీర్థం, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామాలను కలిపేందుకు ఈ వంతెనను నిర్మించారు. అయితే వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ అనుసంధాన రోడ్డు పూర్తి కాకపోవడంతో రూ.కోట్లు వెచ్చించి కట్టిన వంతెన వృథాగా మారింది. ఫలితంగా రెండు జిల్లాల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఈ వంతెన నిరుపయోగంగా మిగిలిపోయింది.
Bridge Approach Roads | 15ఎకరాలకు పైగా భూమి అవసరం..
వంతెనకు ఓవైపు రాంతీర్థం వైపు నుంచి పాపన్నపేట వరకు సుమారు 2.9 కి.మీ అనుసంధాన రోడ్డు నిర్మించాల్సి ఉంది. దీనికోసం సుమారు 15 ఎకరాల భూమి సేకరించాలి. భూసేకరణ, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ. 22.5 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే మెదక్ జిల్లా పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి తదితర మండలాల ప్రజలకు వ్యాపార లావాదేవీలు పెరగడంతో పాటు 40 కి.మీ దూరం తగ్గుతుంది. ఇప్పుడు ప్రజలు చుట్టూ తిరిగి రాకపోకలు సాగిస్తున్నారు.
Bridge Approach Roads | అధికారుల ఏమంటున్నారంటే..
రాంతీర్థం వైపు వంతెన నుంచి పాపన్నపేట వరకు నిర్మించాల్సిన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించామని అధికారులు పేర్కొంటున్నారు. టెండర్ పనులు పూర్తికాగానే( Telangana Development) పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అయితే మరోవైపున నాగిరెడ్డిపేట మండలంలో అప్రోచ్ రోడ్ సైతం అసంపూర్తిగానే మిగిలి ఉంది. దాని నిర్మాణానికి సైతం కామారెడ్డి జిల్లా అధికారులు రూ.13 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఆ నిధులు మంజూరై రెండు పక్కల అప్రోచ్ రోడ్డు పూర్తయినట్లవుతుంది. అప్పుడు రెండు జిల్లాల ప్రజలకు దూర భారం తగ్గనుంది. ఈ నిధులు సైతం త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
టెండర్ పనులు పూర్తికాగానే..
ఈ సందర్భంగా ఆర్అండ్బీ అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటికే వంతెనకుసంబంధించి రూ.22.50కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్లు పనులు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు.