Cockroach Janata Party | విద్యార్థుల పోరాటం ఫలించింది.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్ల సీజేపీ హర్షం

నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా 'కాక్రోచ్‌ జనతా పార్టీ' (CJP) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Cockroach Janata Party | నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నిరసనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాతో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు, సీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఇది పూర్తిగా విద్యార్థుల విజయం అని సీజేపీ ఎక్స్‌ వేదికగా పేర్కొంది. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మాట్లాడుతూ.. శాంతియుతంగా చేసే ఏ ఆందోళనైనా కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటుందని తెలిపారు. యువత సాగించిన శాంతియుత నిరసనల పోరాటం ఫలించిందని, ప్రజాస్వామ్య బలం ఏంటో దీని ద్వారా తెలిసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Cockroach Janata Party | మిగతా డిమాండ్లు నెరవేరే వరకు ..

తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని సీజేపీ స్పష్టం చేసింది. మిగతా డిమాండ్లు కూడా నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Cockroach Janata Party | ఎవరీ అభిజీత్ దీప్కే?

విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దే లక్ష్యంతో కేవలం రెండు నెలల క్రితమే అభిజీత్ దీప్కే ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (CJP)ని స్థాపించారు. సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే ఈ పార్టీ పేరు వైరల్ అయింది. నీట్ పేపర్ లీక్ బాధ్యుడిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ఆయన చేపట్టిన నిరసనలకు భారీ స్పందన లభించింది. వివిధ రంగాల ప్రముఖులు కూడా వీరికి మద్దతుగా నిలిచారు. జులై 20న చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్‌తో పాటు, ప్రధాన్ రాజీనామా చేసే వరకు పట్టు వీడకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. ఈ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే.. మహారాష్ట్రలోని పుణెలో జర్నలిజం పూర్తి చేసి, అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు.

 

ఇది కూడా చదవండి:  KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్​ స్టూడెండ్​ బిల్డర్​ గ్రూప్’​ ప్రారంభం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *