అక్షరటుడే, వెబ్డెస్క్: Influencer Murder | పంజాబ్లోని చండీగఢ్లో ఓ ఇన్ఫ్లుయెన్సర్పై జరిగిన దాడి తీవ్ర విషాదానికి దారితీసింది. ఫోన్ చేసి పిలిపించి, కారులో అపహరించి తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెను చెట్టుకు కట్టేసి తీవ్రంగా దాడి చేసి, నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో వారాల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు చివరకు ప్రాణాలు కోల్పోయింది.
Influencer Murder | బలవంతంగా కారులో ఎక్కించుకుని..
పోలీసుల వివరాల ప్రకారం.. 28 ఏళ్ల మంజీత్ కౌర్కు జులై 3న ఫోన్ కాల్ వచ్చింది. సెక్టార్-34లోని ఓ మద్యం దుకాణం వద్దకు రావాలని శుభి, పిందా అనే వ్యక్తులు ఆమెను పిలిచారు. వారిని నమ్మి అక్కడికి వెళ్లిన మంజీత్ను ఇద్దరూ బలవంతంగా కారులో ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అనంతరం ఆమెను మొరిండా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మంజీత్ను ఓ చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించారు. ఈ దారుణ ఘటనను ఓ పరిచయస్తుడు గమనించడంతో వెంటనే స్పందించాడు. దుప్పటితో మంటలను ఆర్పి, తీవ్ర గాయాలతో ఉన్న మంజీత్ను ఆసుపత్రికి తరలించాడు.
Ganja Chocolates | శామీర్పేటలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత
Influencer Murder | వారాల పాటు మృత్యువుతో పోరాటం
తీవ్ర గాయాల కారణంగా మంజీత్ కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆగస్టు 5న ఆమె స్పృహలోకి రావడంతో తనపై జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించినట్లు సమాచారం. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో.. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఆగస్టు 26న మంజీత్ కౌర్ తుదిశ్వాస విడిచింది.
Influencer Murder | ఒక నిందితుడితో గతంలో సహజీవనం
మంజీత్కు గతంలోనే విడాకులు అయ్యాయని, ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో ఒకరు గతంలో మంజీత్తో సహజీవనం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం శుభి, పిందా ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఓ మహిళను పథకం ప్రకారం పిలిపించి, బలవంతంగా తీసుకెళ్లి, అత్యంత క్రూరంగా దాడి చేసి నిప్పంటించిన ఘటనగా పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మంజీత్ మృతితో కేసు మరింత తీవ్రమైన నేరంగా మారింది. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.