అక్షరటుడే, వెబ్డెస్క్ : Kashmir Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదులు తలదాచుకున్నానే సమాచారం మేరకు భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిత్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించాడు.
బుద్గాం జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో శుక్రవారం సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని పఖేర్పోరా నుంచి బుద్గాంలోని యూస్మార్గ్ వైపుగా ఒక అనుమానిత ఉగ్రవాదుల బృందం కదులుతోందన్న సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Kashmir Encounter | కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా సమాచారం ఆధారంగా బుద్గాంలోని అష్దర్ గలిలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చి, ఒక ఏకే రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరో ఉగ్రవాది అక్కడే ఉన్నాడని బలగాలు అనుమానిస్తున్నాయి.
దీనిని కూడా చదవండి : Traffic Restrictions | దూల్పేటలో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు