Nellore Women Politics | రాజకీయాల్లో ‘వారసురాళ్ల’ హవా.. రంగంలోకి సీనియర్ల కూతుళ్లు, కోడళ్లు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nellore Women Politics | నెల్లూరు( Nellore)  జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. తాము ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తమ రాజకీయ వారసులను రంగంలోకి దించాలని జిల్లాలోని సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారం తమ కుటుంబాల దాటి పోకూడదనే పట్టుదలతో ఉన్న ముఖ్య నాయకులు.. వచ్చే ఎన్నికల్లో తమ కుమార్తెలను, కోడళ్లను బరిలోకి దించేందుకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. భవిష్యత్తులో నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉండటం.. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు మహిళా వారసులు ప్రజల్లో తిరుగుతూ యాక్టివ్ అయ్యారు.

nellur.1

Nellore Women Politics | రంగంలోకి దిగిన ముఖ్య నేతల కుమార్తెలు..

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన పెద్ద కుమార్తె పూజిత రాజకీయాల్లోకి వచ్చారు. సర్వేపల్లి క్యాడర్‌ను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆమె కోసం మరో సేఫ్ సీటును కాకాని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం తన కూతురు ఆనం కైవల్యను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆమెను నియోజకవర్గంలో తిప్పుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం గనుక మహిళలకు రిజర్వ్ అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారసురాలిగా ఆయన కుమార్తె వైష్ణవి పోటీకి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ తన కుమార్తె శరణ్‌ను జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు.

nellur.1 1

Nellore Women Politics | రేసులో కోడళ్లు, భార్యలు కూడా..

కేవలం కుమార్తెలే కాకుండా కుటుంబంలోని ఇతర మహిళా సభ్యులను కూడా కీలక స్థానాల్లో నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కోడలు శృతి బరిలో ఉంటారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొని, ప్రత్యర్థులపై గట్టిగా విమర్శలు చేయడంలో సక్సెస్ అవ్వడంతో టీడీపీ వర్గాల్లో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కురుగొండల కుమార్తె లక్ష్మీ ప్రియ పేరు దాదాపు ఖరారైనప్పటికీ.. చివరి నిమిషంలో ఆయనే పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియ లేదా భార్య సింధు బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Nellore Women Politics | సింహపురి నేతల వ్యూహం ఫలించేనా?

ఇప్పటికే కోవూరు నుంచి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సూళ్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీతో పాటు మరికొందరు మహిళా నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తాము పదవుల్లో ఉన్నప్పుడే, అధిష్టానం మద్దతు ఉన్నప్పుడే తమ వారసురాళ్లను పొలిటికల్‌గా సెటిల్ చేయాలనే సింహపురి నేతల వ్యూహం ఎంతవరకు పారుతుందో.. రాబోయే ఎన్నికల్లో ఎంతమంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెడతారో చూడాలి.

ఇది కూడా చదవండి: Pandu Master Accident | రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్​ మాస్టర్​ పండుకు తీవ్ర గాయాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *