Patna Medical Negligence | వైద్యుల నిర్లక్ష్యం.. చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్తే చేయి కోల్పోయిన యువతి

బిహార్ రాజధాని పాట్నాలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం ఒక యువతి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డెస్క్: Patna Medical Negligence | బిహార్ రాజధాని పాట్నాలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం ఒక యువతి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. చిన్న చెవి నొప్పి సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన రేఖ (20) అనే యువతి.. తప్పుడు వైద్యం కారణంగా ఏకంగా తన ఒక చేతినే కోల్పోవాల్సి వచ్చింది. పాట్నాలోని ‘మహావీర్ ఆరోగ్య సంస్థాన్’ ఆసుపత్రికి వెళ్లిన రేఖకు.. చికిత్స సమయంలో సిబ్బంది తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె చేయి ఆకుపచ్చ రంగులోకి మారిపోయి తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆమెను ‘మేదాంత’ ఆసుపత్రికి తరలించారు.

Patna Medical Negligence | తప్పనిసరి అయిన శస్త్రచికిత్స..

మేదాంత వైద్యులు పరీక్షించి.. తప్పుడు ఇంజెక్షన్ వికటించడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రమైందని, ప్రాణాలు దక్కాలంటే మోచేతి పైభాగం వరకు చేయి తొలగించాలని తెలిపారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి చేయి తొలగించారు.

Patna Medical Negligence | రద్దయిన పెళ్లి సంబంధం..

వైద్యుల అలసత్వం వల్ల చేయి కోల్పోయిన రేఖకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఘటన కారణంగా ఆమెకు నిశ్చయమైన పెళ్లి సంబంధం రద్దయింది. తన జీవితం, భవిష్యత్తు పూర్తిగా నాశనమయ్యాయని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి:  Tellapur Boy Death | తెల్లాపూర్‌లో విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *