అక్షరటుడే వెబ్డెస్క్:Punjab Blasts |పంజాబ్లోని కీలక భద్రతా కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం రాత్రి జరిగిన వరుస పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అమృత్సర్, జలంధర్ నగరాల్లోని సైనిక, సరిహద్దు భద్రతా దళం (BSF) స్థావరాల సమీపంలో కేవలం రెండు గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.
Punjab Blasts | బీఎస్ఎఫ్ కార్యాలయం వద్ద స్కూటర్ పేలుడు..
తొలి ఘటన జలంధర్లోని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ వెలుపల చోటుచేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో ప్రధాన రహదారిపై పార్క్ చేసి ఉన్న ఒక యాక్టివా స్కూటర్ అకస్మాత్తుగా పేలిపోయింది. మొదట దీనిని షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంగా భావించినప్పటికీ, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా వాహనం ఒక్కసారిగా పేలిపోవడం కనిపించింది. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న గుర్ప్రీత్ సింగ్ అనే యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు అక్కడ ఐఈడీ (IED) వాడినట్లు అనుమానిస్తున్నాయి.
Punjab Blasts | అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ సమీపంలో మరో పేలుడు..
జలంధర్ ఘటన మరువక ముందే, రాత్రి 10:50 గంటలకు అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ సమీపంలో మరో పేలుడు శబ్దం వినిపించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ అధికారులు, పంజాబ్ పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో కలిసి రంగంలోకి దిగారు.
పేలుడు జరిగిన తీరును బట్టి చూస్తుంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎల్ (FSL) బృందాలు సంఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించాయి.
Punjab Blasts | తనిఖీలు ముమ్మరం..
ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, దేశంలోని అత్యంత కీలకమైన భద్రతా స్థావరాల సమీపంలోనే ఈ పేలుళ్లు జరగడం వెనుక ఉన్న ఉగ్రకోణాన్ని పోలీసులు తోసిపుచ్చడం లేదు. అమృత్సర్ ఎస్పీ ఆదిత్య ఎస్. వారియర్ మాట్లాడుతూ, దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, దోషులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: Sri City AC Industry | శ్రీ సిటీలో ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన


[…] […]
[…] […]