అక్షరటుడే, వెబ్డెస్క్: Modi Security Lapse | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) బెంగళూరు పర్యటన సందర్భంగా బయటపడిన భద్రతా లోపం వ్యవహారం కర్ణాటకలో రాజకీయంగా, పరిపాలనా పరంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రధాని పర్యటన మార్గానికి సమీపంలో పేలుడు పదార్థాలకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ లభించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టిన అధికారులు తొలి దశలో కీలక చర్యలు తీసుకున్నారు. బెంగళూరు సౌత్ జిల్లా ఎస్పీ ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు వీరిని సస్పెన్షన్లో కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Modi Security Lapse | వారిపై సస్పెన్షన్..
ఈ నెల 10న ప్రధాని మోదీ బెంగళూరు (Bangalore)లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పర్యటించారు. ఆయన కార్యక్రమం ప్రారంభం కావడానికి దాదాపు గంటన్నర ముందు నగర శివార్లలోని కగ్గలీపుర-తాతగుని ప్రాంతంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద ప్యాకెట్ కనిపించింది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ దాన్ని గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే యాంటీ-సబోటేజ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్యాకెట్ను పరిశీలించగా, అందులో రెండు జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, భద్రతాపరమైన జాగ్రత్త చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.
Modi Security Lapse | బెంగళూరులో శాంతిభద్రతల పరిస్థితి
ప్రస్తుతం ఈ ఘటనపై బెంగళూరు సిటీ పోలీసులు, రామనగర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని ప్రయాణించే మార్గానికి కొంత దూరంలో ఈ పేలుడు పదార్థాలు లభించడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక ఇతర కారణాల వల్ల అక్కడికి చేరాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై సెంట్రల్ రేంజ్ డీఐజీ గిరీష్ మాట్లాడుతూ.. “జిలెటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయి? వాటిని ఎవరు ఉంచారు? అనే అంశాలపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నాం” అని తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో కూడా విమర్శలు మొదలయ్యాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర తీవ్రంగా స్పందిస్తూ, ప్రధాని పర్యటన సమయంలో పేలుడు పదార్థాలు కనిపించడం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరులో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆయన విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Petrol Diesel Price Hike 1 | సామాన్యుడిపై ఇంధన మోత.. దేశంలో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


