అక్షరటుడే, వెబ్డెస్క్ : Modi on Women Reservation | మహిళల కలలను విపక్షాలు ధ్వసం చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆరోపించారు. ఆయన శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు.
దేశ మహిళలకు సంబంధించిన ఒక కీలక అంశం గురించి చర్చించడానికి తాను ప్రజల ముందుకు వచ్చానన్నారు. మహిళల పురోగతి ఏ విధంగా స్తంభించిపోయిందో ఈ దేశంలోని ప్రతి పౌరుడూ గమనిస్తూనే ఉన్నాడన్నారు. మా శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, మేము విజయం సాధించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. ‘నారీ శక్తి అధినియం’లో సవరణలు తీసుకురాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై దేశంలోని మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పారు.
Modi on Women Reservation | సంబరాలు చేసుకుంటున్నాయి
మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందన్నారు. కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK), టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారన్నారు. మహిళా బిల్లును ఓడగొట్టి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని విమర్శించారు. మహిళల స్వాభిమానాన్ని అడ్డుకున్నాయని విమర్శించారు. లోక్సభలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు ఏం చేశాయో దేశం మొత్తం చూసిందన్నారు.
Modi on Women Reservation | మహిళలు శిక్షిస్తారు
రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. బిల్లులను అడ్డుకోవడం మహిళల ఆత్మాభిమానంపై దాడిగా ఆయన అభివర్ణించారు. దేశ శ్రేయస్సే తమకు అత్యంత ప్రాధాన్యత అన్నారు. కానీ కొందరు వ్యక్తులకు రాజకీయ ప్రయోజనాలే దేశ శ్రేయస్సు కంటే మిన్నగా ప్రాధాన్యతగా మారినప్పుడు, ఆ భారాన్ని దేశంలోని మహిళలే మోయాల్సి వస్తుందన్నారు. ఈసారి కూడా సరిగ్గా అదే జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ కుటుంబ పార్టీలని, వారు మహిళలను ఎదగనివ్వరని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకున్న వారని మహిళలు తప్పకుండా శిక్షిస్తారని మోదీ పేర్కొన్నారు. ఎంతో నిజాయితీగా తెచ్చిన బిల్లును అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Modi on Women Reservation | కాంగ్రెస్పై విమర్శలు
ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఆ పార్టీ పరాన్నజీవిలా మారిందన్నారు. కాంగ్రెస్ తన దశాబ్దాల నాటి తప్పును సరిదిద్దుకుంటుందని, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని తాను ఆశించానని మోదీ పేర్కొన్నారు. కానీ చరిత్ర సృష్టించి, మహిళలకు మద్దతుగా నిలబడే అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయిందని విమర్శించారు. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి సంస్కరణ తెచ్చిన కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. గతంలో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దును సైతం వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ను సాకుగా చూపి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారన్నారు. ఈ బిల్లుతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడు సంస్కరణలకు వ్యతిరేకమని మోదీ విమర్శించారు.
దీనిని కూడా చదవండి : Rythu Bharosa | రైతులకు గుడ్న్యూస్.. 20న రెండో విడత రైతుభరోసా

