అక్షరటుడే, హైదరాబాద్: TRS Conflict | తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అస్తిత్వ పోరాటానికి చిరునామాగా నిలిచిన ‘TRS’ అనే మూడక్షరాల చుట్టూ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలోనే ఆధిపత్య పోరు మొదలైంది.
ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమ పార్టీని తిరిగి టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా మారుస్తామని ప్రకటించగా.. మరోవైపు కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (Telangana Rashtra Sena) పేరుతో సరికొత్త రాజకీయ శంఖారావాన్ని పూరించారు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, తండ్రి నాయకత్వాన్నే ప్రశ్నించే స్థాయికి ఈ పరిణామాలు దారితీయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
TRS Conflict | ‘TRS’ పేరుపై పట్టు..
జనాల్లో ‘TRS’ అంటే ఒక సెంటిమెంట్. కేటీఆర్ ఆ సెంటిమెంట్ను తిరిగి పార్టీకి జోడించాలని చూస్తుంటే, కవిత అదే పేరుతో (తెలంగాణ రాష్ట్ర సేన) కొత్త పంథాను ఎంచుకున్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు వేర్వేరు రూపాల్లో ‘TRS’ అనే పేర్లు రావడం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో పడే అవకాశం ఉంది.

TRS Conflict | కవిత వ్యూహం..
కేటీఆర్ (KTR) నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నవారిని తన వైపు తిప్పుకోవడానికి కవిత ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
TRS Conflict | కేసీఆర్ గారితో ఇక ఏమీ కాదు..
కవిత తన తాజా వ్యాఖ్యల్లో పరోక్షంగా కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీని లక్ష్యం చేసుకున్నారు. “కేసీఆర్ (KCR) గారితో ఇక ఏమీ కాదు.. ఆయన తప్పుదోవ పట్టించబడ్డారు” అనే సారాంశం వచ్చేలా ఆమె చేసిన విమర్శలు పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. సొంత కూతురే తండ్రి పని అయిపోయిందని చెబుతుంటే, ప్రజలెందుకు నమ్మాలి?” అని కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇది కేసీఆర్ రాజకీయ ప్రభావాన్ని మరింత తగ్గించే ప్రమాదం ఉంది.
‘పాంచజన్యం’: మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడు ఊదిన శంఖం పేరు ‘పాంచజన్యం’. కవిత ఈ పదాన్ని వాడటం వెనుక లోతైన రాజకీయ అర్థం ఉంది.
ధర్మ పోరాటం: తన సొంత కుటుంబం , పార్టీలోని ఒక వర్గంపై తాను చేస్తున్నది ‘ధర్మ పోరాటం’ అని ఆమె చెప్పుకుంటున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ముద్ర వేసిన కవిత, ఇప్పుడు ‘సేన’ ద్వారా రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారు. పార్టీ మూలాలను (తెలంగాణ వాదాన్ని) వదిలేసి బీఆర్ఎస్గా మారడమే ప్రస్తుత పతనానికి కారణమని, ఆ తప్పును దిద్దడమే తన ‘పాంచజన్య’ విధానమని ఆమె సంకేతాలిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇదొక క్లిష్ట సమయం. కేటీఆర్ వారసత్వాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే, కవిత తనకంటూ ఒక కొత్త అస్తిత్వాన్ని సృష్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ‘TRS’ వర్సెస్ ‘TRS’ పోరు గులాబీ కోటను మరింత బలహీనపరుస్తుందా లేక కొత్త నాయకత్వానికి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి..: Telangana Heatwave | రానున్న మూడు రోజులు మండనున్న ఎండలు

