అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Protest | ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వెంటనే స్పందించకపోతే రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను శనివారం బీఆర్ఎస్ నాయకుల బృందం సందర్శించింది.
Paddy Procurement Protest | కేంద్రాల్లో వడ్లు తడిసినా సర్కారుకు పట్టదా..?
ఈ సందర్భంగా కేంద్రాల్లో పేరుకుపోయిన వరి కుప్పలను, రైతుల ఇబ్బందులను బీఆర్ఎస్ బృందం స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు కొనుగోలుకేంద్రాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయని, కొన్నిచోట్ల మొలకలు వస్తున్నా ప్రభుత్వానికి చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు.

తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు రోజుల్లో కల్లాల్లో ఉన్న వడ్లన్నింటినీ ప్రభుత్వం వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జనార్దన్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, జడ్పీ మాజీ ఛైర్మన్ దఫెధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mock Parliament | కలెక్టరేట్లో ఉత్సాహంగా ‘మాక్ పార్లమెంట్’


